అగ్నిప్రమాదం: బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం

9 Aug, 2020 15:29 IST|Sakshi

సాక్షి, విజయవాడ : అగ్ని ప్రమాదానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి సుచరిత, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు. ఈ ప్రమాదంపై వారిద్దరూ ఆదివారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ...‘జరిగిన ప్రమాదంపై ప్రభుత్వం రెండు కమిటీలు నియమించింది. ఒక కమిటీ హోంశాఖ , మరొక కమిటీ వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. రెండు కమిటీలు 48 గంటల్లో నివేదిక ఇస్తాయి. 

నివేదిక వచ్చిన తర్వాత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్నవారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశించారు.  విజయవాడలో 15 ప్రయివేట్‌ కోవిడ్‌ సెంటర్లు ఉన్నాయి, వాటన్నింటినీ తనిఖీ చేస్తాం. ఈ సంఘటనపై ముఖ్యమంత్రి తీవ్ర దిగ్బ్రాంతి  వ్యక్తం చేశారు. ప్రాథమికంగా ఆస్పత్రి వైఫ్యలం ఉన్నట్లు గుర్తించాం. (చదవండి : మృతుల కుటుంబాలకు రూ.50లక్షల ఎక్స్‌గ్రేషియా)

ప్రమాదం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో జరిగింది. 5 గంటల 9 నిమిషాలకు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం వచ్చింది. 5.13 గంటలకు ప్రమాదం జరిగిన స్థలానికి ఫైర్‌ సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 31మంది పేషెంట్లు ఉన్న ఆ సెంటర్‌లో 10మంది చనిపోయారు. ఈ ప్రమాదంపై రెండు కమిటీలు వేశాం. 48 గంటల్లో నివేదిక ఇస్తుంది. ముఖ్యమంత్రి మానవత్వంతో చనిపోయిన ఒక్కొక్క మృతుల కుటుంబానికి 50 లక్షల రూపాయిలు పరిహారం ప్రకటించారు.’ అని తెలిపారు. (అగ్ని ప్రమాదంపై విచారణకు కమిటీ ఏర్పాటు )

ప్రమాదం ఉదయం 4.30 లకు జరిగింది..
అగ్నిప్రమాదంపై ఫైర్ సేఫ్టీ డైరెక్టర్ జయరాం నాయక్‌ మాట్లాడుతూ ప్రమాద సమాచారం అందిన 4 నిమిషాల్లోనే 6 ఫైర్‌ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకున్నాం. ప్రమాదంలో పదిమంది చనిపోయారు. వారిలో ముగ్గురు మహిళలు, ఏడుగురు పురుషులు ఉన్నారు.వారిలో ఏడుగురు ఊపిరి ఆడక చనిపోయారు. మృతులను ఇప్పటికే గుర్తించారు. ప్రమాదం ఎలా జరిగిందనేది నివేదిక వచ్చిన తర్వాత తెలుస్తుందని అన్నారు.

>
మరిన్ని వార్తలు