ఇసుక కోసం ఎవరూ ఇబ్బంది పడకూడదు.. 

4 Aug, 2020 05:16 IST|Sakshi
గనుల శాఖ అధికారులతో సమీక్షిస్తున్న మంత్రులు పెద్దిరెడ్డి, పేర్ని నాని, కొడాలి నాని

అధికారులతో సమీక్షలో మంత్రులు

సాక్షి, అమరావతి: వర్షాకాలం నేపథ్యంలో ఎవరికీ ఇబ్బందుల్లేకుండా ఇసుక అందించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రులు ఆదేశించారు. పంచాయతీరాజ్, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన సోమవారం తాడేపల్లిలోని పంచాయతీరాజ్‌ కమిషనర్‌ కార్యాలయంలో ఇసుక వ్యవహారాలను పర్యవేక్షించేందుకు నియమితులైన కమిటీ సభ్యులు, మంత్రులు కొడాలి వెంకటేశ్వరరావు, పేర్ని వెంకట్రామయ్యలు సమీక్ష నిర్వహించారు. భూగర్భ గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) వైస్‌ చైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ హరినారాయణ్, గనుల శాఖ సంచాలకులు (డీఎంజీ) వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులకు మంత్రులు పలు సూచనలు చేశారు.  

► గ్రామ, వార్డు సచివాలయాల నుంచి ఇసుకను బుక్‌ చేసుకునేందుకు వీలుగా సిబ్బందికి శిక్షణ ఇవ్వాలి.  
► గుర్తింపు పొందిన జలవనరుల నుంచి ట్రాక్టర్లు, ఎడ్లబండ్ల ద్వారా ప్రజలు సొంత అవసరాలకు ఉచితంగా ఇసుకను తీసుకెళ్లడంలో ఇబ్బందుల్లేకుండా చూడాలి.  
► నాడు–నేడు, ఉపాధి హామీ పనులకు ఇసుక కొరత లేకుండా చర్యలు తీసుకోవాలి.

మరిన్ని వార్తలు