‘గురుకుల’ ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

6 Jun, 2021 10:09 IST|Sakshi

జూన్‌ 30వ తేదీ గడువు

సాక్షి, అమరావతి: ఏపీ గురుకుల విద్యాలయాల సంస్థ నిర్వహిస్తున్న 38 సాధారణ, 12 మైనారిటీ బాలుర గురుకుల పాఠశాలల్లో (రీజనల్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌) ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు ఏపీ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఎం.ఆర్‌.ప్రసన్నకుమార్‌ శనివారం తెలిపారు. గుంటూరు జిల్లాలోని తాడికొండ, అనంతపురం జిల్లాలోని కొడిగెనహళ్ళితో సహా మిగిలిన పాఠశాలల్లో 2021– 22 విద్యా సంవత్సరానికి 5 వ తరగతిలో (ఇంగ్లిష్‌ మీడియం) ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ శనివారం నుంచే ప్రారంభంకాగా, ఈనెల 30 వరకు ‘హెచ్‌టీటీపీఎస్‌.ఏపీఆర్‌ఎస్‌. ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్‌.ఇన్‌’ అనే వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. జిల్లాలవారీగా కలెక్టరు కార్యాలయంలో లాటరీ పద్ధతి ద్వారా జూలై 14న అర్హులను ఎంపిక చేస్తారు.

ప్రవేశానికి అర్హత.. 
ఓ.సీ, బీ.సీలకు చెందిన విద్యార్థులు 2010 సెప్టెంబర్‌ 1 నుంచి 2012 ఆగస్టు 31మధ్య పుట్టి ఉండాలి. ∙ఎస్సీ, ఎస్టీలు  2008 సెప్టెంబర్‌ 1 నుంచి 2012 ఆగస్టు 31 మధ్య పుట్టి ఉండాలి. ∙అభ్యర్థులు జిల్లాలో 2019–20,  2020–21 విద్యాసంవత్సరాల్లో నిరవధికంగా ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 3, 4 తరగతులు చదివి ఉండాలి. ∙ఓసీ, బీసీ విద్యార్థులు తప్పనిసరిగా గ్రామీణ ప్రాంతంలోనే చదివి ఉండాలి. ∙గ్రామీణ, పట్టణ ప్రాంత  ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులు పాఠశాలల్లో ప్రవేశానికి అర్హులు. ∙అభ్యర్థి తల్లి, తండ్రి, సంరక్షకుల 2020–21 ఆర్థిక సంవత్సరాదాయం రూ .1,00,000 మించరాదు. 

మరిన్ని వార్తలు