Bendapudi Students Meet CM Jagan: ‘బెండపూడి’ జెడ్పీ హైస్కూల్‌ విద్యార్థులతో ముచ్చటించిన సీఎం జగన్‌

19 May, 2022 15:14 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: కాకినాడ జిల్లా తొండంగి మండలంలోని బెండపూడి జిల్లాపరిషత్‌ హైస్కూలు విద్యార్థులు.. విదేశీ శైలి ఆంగ్లంతో అనర్గళంగా మాట్లాడి అందరినీ అబ్బురపరిచారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు ఈ తరహాలో ఇంగ్లిష్‌లో మాట్లాడడం సోషల్‌ మీడియాలోనూ విపరీతంగా వైరల్‌ అయ్యింది. ‘ఇంగ్లిష్‌పై బెండపూడి జెండా’ కథనం ద్వారా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి వెళ్లింది ఈ విషయం. ఈ నేపథ్యంలో.. ఆయన స్వయంగా రప్పించుకుని ఆ విద్యార్థులతో ముచ్చటించారు. 

గురువారం బెండపూడి జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులు తాడేపల్లికి వెళ్లి.. సీఎం జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా.. వాళ్లతో సీఎం జగన్‌ సంభాషణ దాదాపుగా ఆంగ్లంలోనే కొనసాగింది. వాళ్ల ప్రతిభను మెచ్చుకుని..  భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అందుకోవాలని దీవించారు సీఎం జగన్‌. 

మేఘన అనే స్టూడెంట్‌ తన కిడ్డీ బ్యాంక్‌లోని రూ. 929 సీఎం జగన్‌కు ఇచ్చింది. అయితే మేఘన నుంచి కేవలం రూ.19 మాత్రమే తీసుకుని మిగతా డబ్బును ఆమెకే ఇచ్చారు సీఎం జగన్‌. ఈ దృశ్యం అక్కడున్నవాళ్లను ఆకట్టుకుంది.

సీన్‌ రివర్స్‌ అయ్యింది: టీచర్‌
తాను తెలుగు మీడియం విద్యార్థిని కావడంతోనే.. ఇంగ్లిష్‌పరంగా వాళ్లకు ఇబ్బందులు ఎదురు కాకుండా బోధించానని, తద్వారా విద్యార్థుల్లో ఆంగ్ల భాషపై పట్టు వచ్చిందని విద్యార్థుల కూడా వచ్చిన ప్రభుత్వ టీచర్‌ తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయులంతా నిబద్ధతతో పని చేస్తున్నారని తెలిపారాయన. గత రెండేళ్లలో సీన్‌ రివర్స్‌​ అయ్యిందని, కార్పొరేట్.. ప్రైవేట్‌ స్కూళ్లలోనూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల వీడియోలను ప్రదర్శిస్తుండగా విశేషం అని చెప్పారాయన.

మరిన్ని వార్తలు