పోలీసులపై దాడి చేసిన టీడీపీ నేతలపై కేసులు 

6 Jan, 2023 09:29 IST|Sakshi

శాంతిపురం/చిత్తూరు అర్బన్‌: టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటన సందర్భంగా బుధవారం పోలీసులపై దాడులకు తెగబడిన టీడీపీ నాయకులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. రాళ్లబూదుగూరు ఎస్‌ఐ మునస్వామి తెలిపిన వివరాల మేరకు పోలీసులపై దాడి చేసిన ఇతర జిల్లాలకు చెందిన ఇద్దరు టీడీపీ నాయకులతో పాటు కుప్పం నియోజకవర్గ పరిధిలోని పలువురిపై కేసులు నమోదయ్యాయి. ఎస్‌.గొల్లపల్లి క్రాస్‌లో పోలీసులపై దాడి, చేయి చేసుకోవడం, తోసివేయడం, దౌర్జన్యం చేయడంపై పలమనేరు సీఐ అశోక్‌కుమార్‌ ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

విశ్వనాథనాయుడు, కేదార్‌నాథ్, ఆంజనేయరెడ్డి, చంద్రకళ, నాగరాజు, అనసుయ, ప్రవీణ్, సుగుణ, రమేశ్, జయపాల్‌ తదితరులను నిందితులుగా పేర్కొన్నారు. అనుమతి లేకుండా ప్రచార ర«థాలను వినియోగించినందుకు రామకుప్పం మండలం ననియాలకు చెందిన రాజశేఖర్, పశ్చిమగోదావరి జిల్లా పెద్దవల్లమిల్లికి చెందిన నానిబాబు, గుంటూరు జిల్లా ఫిరంగిపురానికి చెందిన రాజుపై కేసులు నమోదు చేశారు. 121 పెద్దూరులో కృష్ణమూర్తి ఇంటి మేడపై ఉన్న పోలీసులపై దాడికి సంబంధించి గంగవరం ఎస్‌ఐ సుధాకర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు మంజునాథ్, అరుణ్‌కుమార్‌ తదితరులపై కేసులు నమోదయ్యాయి. నిందితులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్సై చెప్పారు.  

వదంతులు వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు.. 
ప్రతిపక్షనేత చంద్రబాబును పోలీసులు అరెస్టు చేస్తారంటూ వదంతులు వ్యాప్తి చేస్తున్న వారిపై చట్టరీత్యా చర్యలు తప్పవని చిత్తూరు ఎస్పీ రిషాంత్‌రెడ్డి గురువారం ఓ ప్రకటనలో హెచ్చరించారు. కుప్పంలో పర్యటిస్తున్న చంద్రబాబును ఏక్షణమైనా పోలీసులు అరెస్టు చేయొచ్చంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారని.. ఇలా తప్పుడు సమాచారంతో ప్రజల్ని తప్పుదారి పట్టించే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.  

మరిన్ని వార్తలు