కానిస్టేబుల్‌ కుటుంబానికి రూ.30 లక్షల చెక్‌ అందించిన సీఎం జగన్‌

15 Dec, 2023 18:37 IST|Sakshi

సాక్షి, గుంటూరు:  విధి నిర్వహణలో.. అనూహ్యంగా ప్రాణాలు పొగొట్టుకున్న ఏపీ కానిస్టేబుల్‌ సత్యకుమార్‌ కుటుంబానికి ప్రభుత్వం బాసటగా నిలిచింది. సత్యకుమార్‌ కుటుంబానికి స్వయంగా పరిహారం అందజేశారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. అంతేకాదు పోలీస్ సిబ్బంది కుటుంబాలకు ప్రభుత్వం ఎల్లవేళలా అండగా నిలుస్తుందని ఈ సందర్భంగా సీఎం జగన్‌ అన్నారు. 

కానిస్టేబుల్ సత్య కుమార్ డిసెంబర్‌ 5వ తేదీన డ్యూటీకి వెళ్తుండగా.. కడప-చెన్నై జాతీయ రహదారిపై జరిగిన యాక్సిడెంట్‌లో చనిపోయారు. ఈ విషయాన్ని డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి సీఎం జగన్‌ దృష్టికి తీసుకెళ్లారు. సత్యకుమార్‌ కుటుంబానికి సానుభూతి తెలియజేయడంతో పాటు ప్రభుత్వం తరఫు నుంచి ఎక్స్‌గ్రేషియాగా రూ.30 లక్షలను ప్రకటించారాయన. శుక్రవారం సాయంత్రం సీఎం క్యాంప్‌ కార్యాలయానికి సత్యకుమార్‌ కుటుంబ సభ్యుల్ని డీజీపీ తీసుకెళ్లి సీఎం జగన్‌ను కలిపించారు. 

సత్యకుమార్‌ భార్యా కొడుకుకి సీఎం జగన్‌ స్వయంగా చెక్‌ అందించారు. అంతేకాదు సత్యకుమార్‌ కొడుకు ప్రస్తుతం ఇంటర్‌ చదువుకున్నట్లు తెలియడంతో.. డిగ్రీ పూర్తైన వెంటనే అతనికి ప్రభుత్వం తరఫున ఉద్యోగం ఇప్పించాలని, అందుకు సంబంధించిన ఉత్తర్వులు ఇప్పుడే జారీ చేయాలని అధికారుల్ని ఆదేశించారు. 

సత్యకుమార్‌ది 2004 ఏపీఎస్పీ బ్యాచ్‌. డిసెంబర్‌ 5వ తేదీన భాకరాపేట సమీపంలో జరిగిన ప్రమాదంలో మరణించారు. మిచాంగ్ తుఫాన్ బీభత్సంతో చెట్టు విరిగి బైక్‌పై వెళ్తున్న ఆయన మీద పడడంతో దుర్మరణం పాలయ్యారు.

>
మరిన్ని వార్తలు