‘మద్యం’ కేసులో బాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ నేటికి వాయిదా

22 Nov, 2023 05:20 IST|Sakshi

వాదనలు వినిపించిన చంద్రబాబు, కొల్లు రవీంద్ర న్యాయవాదులు

శాసన సభ ఆమోదంతోనే ప్రివిలేజ్‌ ఫీజు తొలగించినట్లు తెలిపిన బాబు

గవర్నర్‌ సైతం ఆమోదముద్ర వేశారని వెల్లడి

సీఐడీ వాదనల నిమిత్తం విచారణ నేటికి వాయిదా

సాక్షి, అమరావతి: ‘మద్యం’ కేసులో మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణను హైకోర్టు బుధ­వారానికి వాయిదా వేసింది. చంద్రబాబు సీఎంగా ఉండగా వారి పార్టీ నేతల డిస్టిలరీలు, బార్లకు లబ్ధి చేకూర్చేలా నిర్ణయాలు తీసుకున్నారు. వీటి వల్ల ఖజానాకు రూ.1,500 కోట్ల మేర నష్టం వాటిల్లింది. దీనిపై సీఐడీకి ఏపీ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ ఎండీ ఫిర్యాదు చేశారు. ప్రాథమిక విచారణ జరిపిన సీఐడీ.. అప్పటి ఎక్సైజ్‌ కమిషనర్‌ శ్రీనరేష్, ఎక్సైజ్‌ మంత్రి కొల్లు రవీంద్ర, సీఎం చంద్రబాబుపై కేసు నమోదు చేసింది.

ఈ కేసులో ముందస్తు బెయిల్‌ కోరుతూ చంద్రబాబు, కొల్లు రవీంద్ర, శ్రీనరేష్‌ హై­కోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. చంద్ర­బాబు, రవీంద్రల వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్‌ తల్లాప్రగడ మల్లికార్జునరావు మంగళవారం విచారణ జరిపారు. చంద్రబాబు తరఫున సీనియర్‌ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. మద్యం దుకా­ణాలు, బార్లకు శాసన సభ ఆమోదంతోనే ప్రివిలేజ్‌ ఫీజు తొలగించినట్లు చెప్పారు. ఇందుకు గవర్నర్‌ సైతం ఆమోదముద్ర వేశారన్నారు. ప్రివిలేజ్‌ ఫీజు తొలగిస్తూ ఎక్సైజ్‌ చట్టానికి చేసిన సవరణకు అప్పటి మంత్రి మండలి ఆమోదం కూడా ఉంద­న్నారు.

రాజ్యాంగంలోని అధికరణ 163 (3) ప్రకా­రం గవర్నర్‌కు మంత్రులు చేసిన సూచనలపై న్యాయ సమీక్ష కుదరదని అన్నారు. రాజ­కీయ కక్ష సాధింపులో భాగంగానే ఈ కేసు నమోదు చేశార­న్నారు. కొల్లు రవీంద్ర తరఫున సీని­యర్‌ న్యాయ­వాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. సీఐడీ వాదనల నిమిత్తం విచారణను న్యాయమూర్తి బుధవారానికి వాయిదా వేశారు. కాగా, ముందస్తు బెయిల్‌ కోసం శ్రీనగేష్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై విచార­ణను జస్టిస్‌ మల్లికార్జున­రావు ఈ నెల 28కి వాయిదా వేశారు. 

మరిన్ని వార్తలు