అఖండ పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్‌

17 May, 2023 13:03 IST|Sakshi

సాక్షి, అమరావతి: అఖండ పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. సీఎంకు పూర్ణకుంభంతో వేద పండితులు స్వాగతం పలికారు. శ్రీమహాలక్ష్మి అమ్మవారికి సీఎం జగన్‌ పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో విశాఖ శ్రీశారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర స్వామి, శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి శ్రీస్వాత్మానందేంద్ర స్వామి,అవధూత పీఠాధిపతి గణపతి సచ్చిదానందస్వామిజీ, మంత్రులు కొట్టు సత్యనారాయణ, బొత్స సత్యనారాయణ, టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి దంపతులు పాల్గొన్నారు.

రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్య, అష్ట ఐశ్వర్యాలతో వర్థిల్లాలని, రాష్ట్రం సమగ్రాభివృద్ధి చెందాలని సీఎం వైఎస్‌ జగన్‌ వేదపండితుల మంత్రోచ్ఛారణతో కూడిన సంకల్పం తీసుకొని ఆరు రోజుల క్రితం ఈ మహాయజ్ఞాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇది బుధవారం పండితులు నిర్ణయించిన సుముహూర్తాన తిరిగి సీఎం జగన్‌ చేతుల మీదుగానే అఖండ పూర్ణాహుతి కార్యక్రమంతో ముగిసింది.

రాజశ్యామల అమ్మవారు వేంచేసి ఉన్న వైఖానస యాగశాలలో పూర్ణాహుతికి సంబంధించిన పూజా కార్యక్రమం నిర్వహించారు. పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన నల్లకలువలతో వేదమంత్రోచ్ఛారణల మధ్య రుత్వికులు, ఘనాపాటిలు, పండితులు విశేష పూజా కార్యక్రమాలు చేపట్టారు. కంచి నుంచి ప్రత్యేకంగా తెప్పించిన స్వర్ణ ప్రతిమ రూపంలో ఉన్న అమ్మవారికి సీఎం జగన్‌ ప్రత్యేకంగా అభిషేకించారు.


చదవండి: AP: 19 నుంచి ‘వలంటీర్లకు వందనం’

మరిన్ని వార్తలు