Heavy Rains, Floods: సీఎం జగన్‌ కీలక ఆదేశాలు

21 Nov, 2021 16:34 IST|Sakshi

సాక్షి, అమరావతి: భారీ వర్షాలు, వరద ప్రభావిత ప్రాంతాలకు చెందిన ఇంఛార్జ్‌ మంత్రులు, ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు అక్కడే ఉండి సహాయ కార్యక్రమాలు పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలకు తక్షణ సహాయం అందేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అక్కడున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి వాటి పరిష్కారానికి కృషి చేయాలని, తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు వరద బాధితులకు అండగా నిలవాలని మంత్రులు, ఎమ్మెల్యేలను సీఎం ఆదేశించారు. 

చదవండి: (మరోసారి మానవత్వాన్ని చాటుకున్న సీఎం జగన్)

పట్టణాల్లో పారిశుద్ధ్య పనులు, డ్రైనేజీల పూడికతీత పనులతో పాటు, వరద ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా వైద్య సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. బాధితులకు ప్రభుత్వం అందిస్తున్న రేషన్‌ సరుకుల పంపిణీ, జరిగిన నష్టంపై పక్కాగా అంచనాలు రూపొందించాలన్నారు. పంటలు పూర్తిగా దెబ్బతిన్న రైతులు.. తిరిగి పంటలు సాగు చేసేలా గతంలోనే ప్రకటించిన విధంగా వారికి విత్తనాలు, తదితరమైనవి అందేలా చర్యలు తీసుకోవాలని, ఎక్కడికక్కడ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు తోడుగా నిలవాలని సీఎం నిర్దేశించారు. వరద ప్రభావిత ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాల్సిన అవసరం లేదని, తమ ప్రాంతంలోనే ఉండి సహాయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు.

చదవండి: (ఆ ప్రాంతాల్లో నిత్యావసరాల పంపిణీకి ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలు)

మరిన్ని వార్తలు