9.48 లక్షల మంది రైతులకు రూ.1,252 కోట్ల బీమా పరిహారం

15 Dec, 2020 16:41 IST|Sakshi

సాక్షి, అమరావతి: ప్రభుత్వం అన్నదాతను ఆదుకునేందుకు అధిక ప్రాధాన్యమిస్తోంది. వైఎస్సార్‌ పంట బీమాతో రైతాంగానికి భరోసా కల్పిస్తోంది. వాతావరణ పరిస్థితులతో సక్రమంగా దిగుబడి పొందలేని రైతులకు పరిహారం చెల్లించే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బీమా సొమ్మును ఆయా కర్షకుల ఖాతాల్లో జమచేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. 2019 సీజన్‌లో పంట నష్టపోయిన 9.48 లక్షల మంది రైతులకు దాదాపు రూ.1,252 కోట్ల బీమా పరిహారం దక్కనుంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్‌ బటన్‌నొక్కి నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో ఈ మెత్తాన్ని జమచేశారు. 

ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ... 'వైఎస్సార్‌ పంటల బీమా పథకంతో మరో అడుగు ముందుకు వేశాం. గతంలో పంటల బీమా పథకంలో చేరేందుకు రైతులు నిరాకరించేవారు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుల ప్రీమియం కూడా.. ప్రభుత్వమే చెల్లించాలని నిర్ణయం తీసుకున్నాం. 2019లో పంట నష్టపోయిన 9.48 లక్షల మంది రైతులకు.. రూ.1252 కోట్ల బీమా సొమ్మును అందిస్తున్నాం. ఇన్సూరెన్స్ ప్రీమియం రైతులకు గుదిబండ కాకూడదు. పంట నష్టం జరిగితే బీమా వస్తుందన్న నమ్మకం రైతుల్లో కలగాలి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఉచిత పంటల బీమాను అందిస్తున్నాం.

గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు రైతు కూడా ప్రీమియం చెల్లించాల్సి ఉండేది. కానీ బీమా సొమ్ము ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి.. ఇప్పుడు ఆ పరిస్థితులను పూర్తిగా మార్చాం. రాష్ట్ర ప్రభుత్వమే రైతుల తరుపున బీమా ప్రీమియం చెల్లిస్తున్నాం. గతంలో 20 లక్షల మంది రైతులకు మాత్రమే ఇన్సూరెన్స్ పరిధిలో ఉంటే.. ఇప్పుడు 57 లక్షల మంది రైతులు పంటల బీమా పథకంలో నమోదయ్యారు. కోటి 14 లక్షల ఎకరాలను బీమా పరిధిలోకి తీసుకొచ్చాం. గ్రామ సచివాలయాలతో ఆర్‌బీకేలను అనుసంధానం చేశాం. గ్రామంలోని ప్రతి ఎకరా ఈ-క్రాపింగ్‌లో నమోదవుతోంది' అని సీఎం వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

రాష్ట్రంలో ఇదే తొలిసారి..
గతంలో చంద్రబాబు సర్కార్‌ ఎప్పుడూ పంటలు కోల్పోయిన రైతులకు సకాలంలో బీమా సొమ్ము చెల్లించలేదు. పైగా రైతులపై ప్రీమియం పేరుతో వందల కోట్ల రూపాయల భారం మోపింది. దీంతో రైతులు బీమా సౌకర్యం పొందలేకపోయారు. రైతన్నల బాధకు చలించిపోయిన సీఎం వైఎస్‌ జగన్‌ దేశంలో ఎక్కడా లేని విధంగా వారిపై పైసా కూడా ఆర్థిక భారం పడకుండా ప్రభుత్వమే పూర్తి ఖర్చు భరించేలా నిర్ణయం తీసుకున్నారు. రైతుల తరఫున బీమా సొమ్మును ప్రభుత్వమే చెల్లిస్తూ ఉచిత పంటల బీమా అమలు చేస్తున్నారు. 2019 సీజన్‌లో పంట నష్టానికి ఏడాది తిరగకముందే బీమా పరిహారాన్ని రైతుల ఖాతాలకు జమ చేయడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం.  చదవండి: (అగ్రి గోల్డ్‌ బాధితులకు తీపి కబురు)

పారదర్శకతకు పెద్దపీట
ప్రభుత్వం వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాల ద్వారా గ్రామంలో సాగు చేసిన పంటల వివరాలను ఈ–క్రాప్‌లో నమోదు చేసి బీమా సౌకర్యం కల్పిస్తోంది. అంతేకాకుండా ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోయినప్పుడు ఆ నష్టాన్ని అంచనా వేసి పరిహారం చెల్లించే ఏర్పాటు చేసింది. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ.. రైతులు స్వయంగా పరిశీలించుకునేందుకు వీలుగా రైతు భరోసా కేంద్రాల్లో ఈ–క్రాప్‌ వివరాలతో సహా లబ్ధిదారుల జాబితాలను ప్రదర్శించారు. 2019–20లో 49.81 లక్షల మంది రైతులకు చెందిన 45.96 లక్షల హెక్టార్లకు పంటల బీమాను వర్తింప చేసింది. ఇందుకోసం రైతులు చెల్లించాల్సిన రూ.468 కోట్ల ప్రీమియంను కూడా ప్రభుత్వమే భరిస్తూ మొత్తం రూ.971.23 కోట్లు చెల్లించింది. 

మరిన్ని వార్తలు