ఇళ్ల నిర్మాణంలో ఎలాంటి లోపం ఉండకూడదు: సీఎం జగన్‌

17 Feb, 2023 18:26 IST|Sakshi

సాక్షి, అమరావతి: గృహ నిర్మాణ శాఖపై తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం సమీక్ష చేపట్టారు. ఇళ్ల నిర్మాణం, టిడ్కో ఇళ్లపై ఆయన సమీక్షించారు.

ఈ సందర్భంగా అధికారులు తెలిపిన వివరాలు ఇవే..

  • వర్షాలు తగ్గిన తర్వాత డిసెంబర్‌ నుంచి ఇళ్ల నిర్మాణం శరవేగంగా జరుగుతోందన్నారు. 
  • ఇళ్ల నిర్మాణంలో ఎలాంటి నాణ్యతా లోపం లేకుండా చర్యలు తీసుకున్నట్టు తెలిపారు.
  • స్టేజ్‌ కన్వెర్షన్‌ కూడా బాగా జరిగిందని వివరించారు.
  •  ఇళ్ల నిర్మాణాల్లో నాణ్యతను పరీక్షించేందుకు మొత్తంగా 36 ల్యాబ్స్‌ ఏర్పాటు చేశామని వెల్లడించారు.  
  • ఇళ్ల నిర్మాణంలో ఉపయోగించే మెటల్ నాణ్యతపై 285 పరీక్షలు, సిమెంటుపైన 34 పరీక్షలు, స్టీలుపై 84 పరీక్షలు, ఇటుకలపైన 95 టెస్టులు.. ఇలా పలురకాల పరీక్షలు నిర్వహించామన్నారు. 
  • ఎక్కడ లోపం వచ్చినా వెంటనే గుర్తించి నాణ్యతను పెంచుకునేందుకు ల్యాబ్స్‌ వినియోగపడుతున్నాయని అధికారులు వివరించారు. 

సీఎం జగన్‌ ఏమన్నారంటే..
సొంత ఇల్లు అనేది పేదవాడి కల, ఇళ్ల నిర్మాణంలో ఎలాంటి లోపం ఉండకూడదు. ఈ ల్యాబ్స్‌ను వినియోగించుకుని ఎప్పటికప్పుడు పరీక్షలను నిర్వహించి, పేదవాడికి అత్యంత నాణ్యమైన ఇంటిని అందించాలి. లే అవుట్లలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసిన తర్వాత, వాటి నిర్వహణ విషయంలో గ్రామ, వార్డు సచివాలయాలు కీలక పాత్ర పోషించాలి. లే అవుట్లు పూర్తవుతున్న కొద్దీ మౌలిక సదుపాయాలను ప్రాధాన్యతా క్రమంలో ఏర్పాటు చేసుకుంటూ ముందుకుసాగాలని ముఖ్యమంత్రి జగన్‌ సూచించారు. 

కోర్టు కేసుల కారణంగా ప్రకాశం, అనంతపురం జిల్లాల్లోని 2 లే అవుట్లకు బదులుగా ప్రత్యామ్నాయ భూములను ఎంపిక చేశామని అధికారులు వెల్లడించారు. సుమారు 30 వేలమందికి ఇళ్ల నిర్మాణంలో కోర్టు కేసుల కారణంగా జాప్యం జరిగిందని, వీరికి త్వరలోనే పట్టాల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఇందుకు అసవరమైన భూ సేకరణ కోసం అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ ఆదేశించారు.  

  • ఇళ్ల నిర్మాణ కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో జనవరి నెలాఖరు వరకూ చేసిన ఖర్చు రూ.7630 కోట్లు.
  • ప్రభత్వం ఇప్పటి వరకూ మొత్తంగా రూ.13,780 కోట్లు కేవలం ఇళ్ల నిర్మాణం కోసమే ఖర్చు చేసింది. 
  • ఇప్పటివరకూ సుమారుగా 2.75 లక్షల ఇళ్లను పూర్తిచేశామని, మరో 74వేల ఇళ్లలో శ్వాబ్స్‌ వేసే పనులు జరుగుతున్నాయని, మరో 79వేల ఇళ్లు రూఫ్‌ లెవల్లో ఉన్నాయని అధికారులు తెలిపారు.
  • మార్చి నాటికి పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం కింద చేపట్టిన ఇళ్లలో సుమారు 5 లక్షల ఇళ్లు పూర్తిచేసే దిశగా పనులు జరుగుతున్నాయని అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. 

టిడ్కో ఇళ్లపైనా సీఎం జగన్‌ సమీక్ష..
టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం గణనీయంగా సహాయం అందించిందని సీఎం జగన్‌ తెలిపారు. 
ఈ మూడున్నర సంవత్సరాలలో ఇళ్ల నిర్మాణం, మౌలిక సదుపాయాలు, ఉచితంగా 300 అడుగులు ఇళ్లు, మిగిలిన కేటగిరీల లబ్ధిదారులకు తమవంతుగా చెల్లించిన వాటిపై  సబ్సిడీ ఇవ్వడంతో పాటు, ఉచితంగా ప్రభుత్వం రిజిస్ట్రేషన్లు చేసింది. 
అధికారులు అందించిన వివరాల ప్రకారం.. టిడ్కో ఇళ్ల కోసం గత ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన ఖర్చు రూ.8015 కోట్లు అయితే ఈ ప్రభుత్వం చేసిన ఖర్చు, పేదలకు కల్పించిన ప్రయోజనాలు విలువ మొత్తంగా రూ.20,745 కోట్లని సీఎం జగన్‌ స్పష్టం చేశారు.

  • టిడ్కో ఇళ్ల నిర్మాణ ఖర్చు కింద, మౌలిక సదుపాయాలకోసం ఈ మూడున్నర సంవత్సరాల్లోనే రూ.8,734 కోట్లు ఖర్చుచేశామని, దీంతోపాటు 300 అడుగుల ఇళ్లను ఉచితంగా ఇవ్వడం వల్ల దాదాపు రూ.10,339 కోట్ల రూపాయల లబ్ధి పేదలకు జరిగిందని తెలిపారు.  
  • వీరు తమ వంతుగా చెల్లించాల్సిన డబ్బును పూర్తిగా మాఫీ చేయడమే కాకుండా, బ్యాంకుల నుంచి అప్పు తీసుకోవాల్సిన అవసరం లేకుండా, నెలా నెలా వాయిదాలు కట్టాల్సిన పనిలేకుండా పూర్తి ఉచితంగా ఆ ఇళ్లను అందిస్తున్నామన్నారు. 
  • మిగిలిన వారికి ఊరట కల్పించే చర్యల్లో భాగంగా 365, 430 చదరపు అడుగులు ఇళ్లకు లబ్ధిదారులకు తమ వంతుగా చెల్లించాల్సిన డబ్బులో కల్పించిన సబ్సిడీ కారణంగా రూ. 482 కోట్ల మేర లబ్ధి జరిగిందని, ఆ మేరకు ప్రభుత్వం ఆ భారాన్ని కూడా తీసుకుంటుందన్నారు. 
  • అలాగే రిజిస్ట్రేషన్‌ ఛార్జీలను కూడా తొలగించి ఉచితంగా ఇళ్లు రిజిస్ట్రేషన్‌ చేయించడం ద్వారా మరో రూ.1200 కోట్ల భారాన్ని ప్రభుత్వం తీసుకుందని తెలిపారు. 
  • నిర్మాణ ఖర్చులు, పైన కల్పించిన ప్రయోజనాలు ద్వారా ప్రభుత్వం తీసుకున్న భారంగా చూస్తే రూ.20,745 కోట్లు ఈ ప్రభుత్వం టిడ్కో ఇళ్లమీద పెట్టిందని ముఖ్యమంత్రి జగన్‌ వెల్లడించారు. 

పేదలందరికీ ఇళ్ల కింద ప్రభుత్వం ఇప్పటివరకూ చేసిన ఖర్చు..

  • ఇళ్ల నిర్మాణం కోసం ఉచితంగా ఇసుక పంపిణీ, తక్కువ ఖరీదుకే సామాగ్రిని అందించడం వలన కలిగిన ప్రయోజనం రూపేణా ప్రభుత్వం చేసిన మొత్తం ఖర్చు రూ.13,757.7 కోట్లు. 
  • ఇళ్ల నిర్మాణ పనులు మొదలు పెట్టడానికి కాలనీల్లో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.3,117 కోట్లు.
  • తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ, రహదారుల తదితర సదుపాయాల కోసం చేస్తున్న ఖర్చు రూ.32,909 కోట్లు.
  • అంటే కేవలం జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసమే చేసిన ఖర్చు రూ.36,026 కోట్లు.
  • పేదలకు ఇళ్ల పట్టాల కింద ప్రభుత్వ భూములు 28,554.64 ఎకరాలు. వీటి విలువ రూ.17,132.78 కోట్లు.
  • ఇళ్ల పట్టాల పంపిణీ కోసం ప్రభుత్వం డబ్బు పెట్టి కొన్న భూమి 25,374.66 ఎకరాలు. ఈ భూముల విలువ సుమారు. 15,364.5 కోట్లు.
  • విశాఖలో పేదలకు పంపిణీ చేసిన భూముల విలువ రూ.12,405 కోట్లు.
  • ఇళ్ల పట్టాల కోసం ఇచ్చిన ఇతర భూములు 13,425.14 ఎకరాలు. వీటి విలువ రూ.11,200.62 కోట్లు.
  • మొత్తమ్మీద అన్ని రకాలుగా ఇళ్లపట్టాల రూపేణా పేదలకు పంచిన భూములు 71,811.49 ఎకరాలు. ఈ భూములు విలువ రూ.56,102.91 కోట్లు.
  • పేదలంరికీ ఇళ్ల పథకం కింద ప్రభుత్వం చేస్తున్న ఖర్చు, కార్యక్రమం విలువ మొత్తం రూ.1,05,886.61 కోట్లు.

ఈ సమావేశంలో మంత్రులు జోగి రమేష్, ఆదిమూలపు సురేష్, ఏపీ స్టేట్‌ హౌసింగ్‌ బోర్డు కార్పొరేషన్‌ లిమిటెడ్‌ చైర్మన్‌ దవులూరి దొరబాబు, టిడ్కో చైర్మన్‌ జమ్మాన ప్రసన్నకుమార్, సీఎస్‌ డాక్టర్‌ కే ఎస్‌ జవహర్‌ రెడ్డి,  పురపాలక పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్‌ వై శ్రీలక్ష్మి, గృహ నిర్మాణశాఖ స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌ జైన్, ఆర్ధికశాఖ కార్యదర్శి కె వి వి సత్యనారాయణ, గృహనిర్మాణశాఖ ప్రత్యేక కార్యదర్శి మహమ్మద్‌ దివాన్‌ మైదిన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు