మిచౌంగ్ తుపాను.. అధికారులు అప్రమత్తంగా ఉండాలి: సీఎం జగన్‌

4 Dec, 2023 18:55 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి:  తుపాను దృష్ట్యా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. ఎనిమిది మంది జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్పరెన్స్‌ నిర్వహించారు. ఈరోజు(సోమవారం) తుపాను ప్రభావం ఉండే పలు జిల్లాల కలెక్టర్లతో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.  ఈ వీడియో కాన్పరెన్స్‌లో పలు శాఖలకు చెందిన అధికారులు సైతం పాల్గొన్నారు.


ఈ సందర్భంగా సీఎం జగన్‌ ఏమన్నారంటే..

  • తుపాను సందర్బంగా ప్రభుత్వ యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలి
  • హుద్‌హుద్‌ లాంటి పెద్ద పెద్ద తుపాన్లను చూసిన అనుభవం మనకు ఉంది
  • తుపాన్లను ఎదుర్కోవడంలో మన యంత్రాంగానికి మంచి అనుభవం ఉంది:
  • తుపాన్‌ పట్ల అప్రమత్తంగా  ఉంటూ యంత్రాంగం సీరియస్‌గా ఉండాల్సిన అవసరం ఉంది:
  • బాపట్ల సమీపంలో రేపు సాయంత్రం తీరందాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు
  • గంటకు 110 కి.మీ. వేగంతో గాలులు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు
  • ఇప్పటికే జిల్లాల కలెక్టర్లకు నిధులు విడుదలచేశాం
  • అత్యవసర ఖర్చులకు ప్రతి జిల్లాకు రూ.2 కోట్ల చొప్పున నిధులు ఇవ్వాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం
  • ప్రతి జిల్లాకు సీనియర్‌ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమిస్తున్నాం:
  • వీరంతాకూడా జిల్లాల యంత్రాంగంతో కలిసి సహాయక చర్యలను పర్యవేక్షిస్తారు: 
  • ఎలాంటి ప్రాణనష్టం లేకుండా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉంది:
  • పశువులకూ ఎలాంటి ప్రాణనష్టం రాకూడదు:
  • ఆ మేరకు వెంటనే చర్యలు తీసుకోవాలి:
  • కోతకు వచ్చిన ఖరీఫ్‌ పంటను కాపాడుకోవడం అన్నది చాలా  ముఖ్యమైనది
  • నిన్న ఒక్కరోజే 97 వేల టన్నలు ధాన్యాన్ని సేకరించాం
  • 6.5 లక్షల టన్నుల ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాం:
  • పంటకోయని ప్రాంతాల్లో వీలైనంత మేర కోయకుండా వాయిదా వేసుకుంటే మంచిదని అధికారులు చెప్తున్నారు
  • దీనిపై రైతులకు అవగాహన కల్పించాలి
  • కోసిన ధాన్యాన్ని వెంటనే సేకరించడంపై అధికారులు దృష్టిపెట్టాలి
  • యుద్ధ ప్రాతిపదికన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి:
  • తేమ, రంగు లాంటి అంశాలను పట్టించుకోకుండా రైతులకు అండగా నిలవండి:
  • తుపాను దృష్ట్యా రైతులకు తోడుగా నిలవాల్సిన అవసరం ఉంది:
  • అన్నిరకాలుగా రైతులకు తోడుగా నిలవడం అన్నది అత్యంత ప్రాధాన్యతాంశం
  • తుపాను ప్రభావం ఉన్న ప్రాంతాలనుంచి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలి:
  • 308 శిబిరాల ఏర్పాటుకు గుర్తించామని, అప్పటివరకూ 181 తెరిచామని చెప్తున్నారు:
  • అవసరమైన చోట వెంటనే శిబిరాలను తెరిచి ప్రజలను అక్కడకు తరలించాలి:
  • ఇప్పటికే ఎన్డీఆర్‌ఎఫ్‌ టీమ్స్‌ 5, ఎస్డీఆర్‌ఎఫ్‌ టీమ్స్‌ 5 కూడా ఉన్నాయి:
  • ఇతర రాష్ట్రాలకు లేని, మనకు మాత్రమే ఉన్న మరో బలం ఏంటంటే గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ
  • విలేజ్‌ క్లినిక్స్‌, ఆర్బీకేలు కూడా మనకు ఉన్నాయి:
  • ఇది మనకు ఉన్న పటిష్టమైన బలం
  • ఇతర రాష్ట్రాలకు ఇలాంటి వ్యవస్థ లేదు 
  • ఈ యంత్రాంగాన్ని బాగా వినియోగించుకోవాలి
  • ఈ వ్యవస్థను అత్యంత సమర్థవంతంగా వినియోగించుకోవాలి
  • ప్రజల ప్రాణాలను రక్షించడంలో, తపాను వల్ల, భారీవర్షాల వల్ల దెబ్బతినే అవకాశాలున్న ప్రాంతాల్లో వీరి సేవలను వినియోగించుకోవాలి
  • సహాయక శిబిరాల్లో వచ్చే ప్రజలకు మంచి సౌకర్యాలను ఏర్పాటు చేయాలి
  • మనం ఉంటే ఎలాంటి సదుపాయాలు కోరుకుంటామో, అలాంటి సదుపాయాలు ఉండాలి
  • మందులు, తాగునీరు, మంచి ఆహారం అందించాలి:
  • కాస్త డబ్బు ఖర్చైనా పర్వాలేదు, సదుపాయాలు విషయంలో ఎలాంటి లోటూ రాకూడదు:
  • క్యాంపునుంచి ఇంటికి వెళ్లేటన్పుడు చిరునవ్వుతో వారు ఇంటికి వెళ్లాలి:
  • ప్రతి ఒక్కరికీ రూ.1000 లేదా కుటుంబానికి గతంలో మాదిరిగా కాకుండా రూ.500 పెంచి రూ.2500ఇవ్వాలి:
  • క్యాంపులకు రాకుండా, ఇళ్లలోకి నీళ్లు చేరిన వారికి  25 కేజీల బియ్యం, కందిపప్పు, పామాయిల్‌, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు కిలోచొప్పున అందించాలి
  • ఈ రేషన్‌ను వారికి సకాలంలో సక్రమంగా అందించాలి
  • గాలులు వల్ల, వర్షాల వల్ల గుడిసెల్లాంటివి దెబ్బతింటే వారికి రూ.10వేలు అందించాలి
  • బాధితుల పట్ల దయతో, సానుభూతితో అందించాలి
  • పరిహారాన్ని సకాలంలో అందించాలి
  • తుపాను తగ్గు ముఖం పట్టిన 24 గంటల్లో వీటిని అందించాలి
  • గ్రామ సచివాలయాలు, వాలంటీర్లు వ్యవస్థను వినియోగించుకుని బాధితులను గుర్తించి వెంటనే వారికి ఇవ్వాల్సినవి ఇవ్వాలి
  • ఎమర్జెన్సీ సర్వీసుల నిర్వహణపై దృష్టిపెట్టాలి
  • జనరేటర్లను అందుబాటులో ఉంచుకోవాలి
  • గర్భిణీలను ఆస్పత్రులకు తరలించాలి
  • తుపాను వల్ల వచ్చే వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత వ్యాధులు ప్రబలకుండా ఆరోగ్య శిబిరాలు నిర్వహించాలి
  • పారిశుద్ధ్య కార్యక్రమాలు యుద్ధ ప్రాతిపదికిన నిర్వహించాలి
  • విద్యుత్‌, రవాణా సౌకర్యాలకు అంతరాయం ఏర్పడితే వెంటనే యుద్ధ ప్రాతిపదికిన వాటిని సరిచేయాలి
  • సాధారణ పరిస్థితులను తీసుకురావడంపై ప్రత్యేకాధికారులు దృష్టిపెట్టాలి
  • తుపాను, వర్షాలు తగ్గాక పంటలకు జరిగిన నష్టంపై వెంటనే ఎన్యుమరేషన్‌ పూర్తిచేయాలి
  • నేను కూడా ప్రజల దగ్గరకు వెళ్లి.. కలెక్టర్లు బాగా చేశారా? లేదా? అడుగుతాను
  • బాగానే చేశారని ప్రజలు సంతోషంగా నాకు చెప్పాలి
  • తుపాను బాధిత ప్రాంతాల్లో తిరుగుతాను, ప్రభుత్వం యంత్రాంగం పనితీరుపై అడిగి తెలుసుకుంటాను
  • సహాయం అందలేదని, బాగా చూసుకోలేదన్న మాట బాధితులనుంచి వినిపించకూడదు
  • సంతృప్తకర స్థాయిలో బాధితులందరికీ సహాయం అందాలి
  • ఈ సాయంత్రం నుంచి ప్రత్యేకాధికారులు జిల్లాల్లో పర్యవేక్షణ ప్రారంభిస్తారు
  • డబ్బులు ఇంకా అవసరమైతే..వెంటనే పంపించడానికి అన్నిరకాలుగా ఏర్పాట్లు చేశాను
  • ఒక ఫోన్‌ కాల్‌ దూరంలో మేం ఉంటాం. ఏం కావాలన్నా వెంటనే అడగండి
  • సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికిన నడవాలి

>
మరిన్ని వార్తలు