కలెక్టర్లు, ఎస్పీలు అప్రమత్తంగా ఉండాలి: సీఎం జగన్‌

25 Aug, 2021 20:53 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: దురదృష్టకర ఘటనలు జరిగినప్పుడు పోలీసులు, కలెక్టర్లు ఎంత బాగా స్పందించినప్పటికీ కొంతమంది స్వార్ధప్రయోజనాల కోసం తప్పుడు ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వంపై బురదజల్లాలని ఆరాటపడుతూ... చేయకూడని పనులు చేస్తున్నారని మండిపడ్డారు. ఆడ పిల్లలు, వారి కుటుంబాల గౌరవానికి నష్టం జరుగుతుందని తెలిసినా కూడా దాన్ని రాజకీయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్పందనపై వీడియో కాన్ఫరెన్స్‌ సందర్భంగా రాష్ట్రంలో ఇటీవల జరిగిన దురదృష్టకర సంఘటనలు, వాటిపై  జరుగుతున్న వ్యతిరేక ప్రచారం గురించి సీఎం జగన్‌ మాట్లాడారు. 

‘‘ఒక ఈవ్‌టీజింగ్‌ కేసులో కానిస్టేబుల్‌ సస్పెండ్‌ అయ్యాడు. ఆ కేసులో అమ్మాయి, ఆ కుటుంబం ఆత్మాభిమానం దెబ్బతినేలా, వారికి కళంకం తెచ్చేలా ఆ కేసుకు సంబంధించి సోషల్‌ మీడియాలో ప్రచారం చేసిన తీరు, మీడియాతో మాట్లాడిన విధానం ఆ కుటుంబ గౌరవాన్ని మంటగలిపేలా ఉంది. దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. కలెక్టర్లు, ఎస్పీలు అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి సంఘటనల పట్ల మరింత సున్నితంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. స్వప్రయోజనాలకోసం ఒక వర్గం మీడియా చేస్తున్న వ్యతిరేక ప్రచారం పై కూడా మనం పోరాటం చేస్తున్నాం. మనం వాస్తవానికి రాజకీయ పార్టీలతో యుద్దం చేయడం లేదు. 

ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5తో యుద్ధం చేస్తున్నాం. వాటికి సొంత ప్రయోజనాలు తప్ప మరే అంశాలు పట్టవు. వాళ్లనుకున్న వ్యక్తిని ముఖ్యమంత్రి స్ధానంలో కూర్చోబెట్టడానికి ఎవరిమీదనైనా వీళ్లు బురద జల్లుతారు. అందుకోసం మిమ్నల్ని కూడా మినహాయించరు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకోండి. మన చుట్టూ ఏం జరుగుతుందో చూడాలి. మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి.

చిన్న సంఘటన జరిగినా వెంటనే అప్రమత్తం కావాలి. ఎలాంటి వక్రీకరణకు తావివ్వకూడదు. మీరు ఎంత జాగ్రత్తగా పనిచేస్తున్నారు, ఎంత మంచిగా పనిచేస్తున్నారన్నది ఆ వర్గం మీడియాకు అవసరం లేదు. స్వార్ధ ప్రయోజనాలే వారి లక్ష్యం. దీన్ని దృష్టిలో ఉంచుకుని మరింత అప్రమత్తంగా పనిచేయాలి’’ అని సీఎం వైఎస్‌ జగన్‌ కలెక్టర్లు, ఎస్పీలకు దిశా నిర్దేశం చేశారు.

చదవండి: సీఎం జగన్‌ను కలిసిన ‘సెంచరీ ప్లై బోర్డ్స్‌’ ప్రతినిధులు

మరిన్ని వార్తలు