రోడ్ల పనులు కనిపించడం లేదా?

9 Sep, 2023 04:29 IST|Sakshi

రాష్ట్రంలో శరవేగంగా జరుగుతున్న రోడ్ల నిర్మాణం 

టీడీపీ హయాంలో కంటే రెట్టింపు నిధులతో పనులు 

చంద్రబాబు ఐదేళ్ల పాలనలో రూ. 2,953.81 కోట్లు ఖర్చు 

వైఎస్సార్‌సీపీ పాలనలో నాలుగేళ్లలోనే రూ. 4,148.59 కోట్ల వ్యయం  

ఒక్క ఏడాదిలోనే 7,500 కి.మీ. రోడ్ల పునరుద్ధరణ

సాక్షి, అమరావతి: ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై నిత్యం అసత్య ప్రచారం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న రామోజీరావు.. రాష్ట్ర ప్రభుత్వంపై మరోసారి తన అక్కసు వెళ్లగక్కారు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో రోడ్లపై నీరు నిల్వ ఉన్న ప్రదేశాల ఫొటోలు ప్రచురించి ఈనాడు పత్రిక దిగజారుడు పాత్రికేయాన్ని ప్రదర్శించింది. ‘సాఫీ ప్రయాణం సీఎంకేనా’ అంటూ ఓ అసత్య కథనంతో పాఠకులను మోసగించేందుకు ప్రయత్నించింది. ఈనాడు కథనాన్ని ఖండిస్తూ.. రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధిపై వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతూ ఆర్‌అండ్‌బీ శాఖ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది.  

అత్యంత ప్రాధాన్యతతో రోడ్ల నిర్మాణం 
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రోడ్ల అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తోంది. ఏటా షెడ్యూల్‌ ప్రకారం రోడ్ల పునరుద్ధరణ పనులు చేపడుతోంది. రెండేళ్లపాటు కోవిడ్‌ ప్రభావం ఉన్నాసరే రోడ్ల పనులను నిర్లక్ష్యం చేయలేదు. నాలుగేళ్లుగా భా­రీ వర్షాలు కురుస్తున్నా రోడ్ల పునరుద్ధరణ పనులు నిరంతరాయంగా కొనసాగుతూనే ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలోనే రూ. 2,400 కోట్లు ఖర్చు చేసి 7,500 కి.మీ. మేర రోడ్లను పునరుద్ధరించింది. కానీ ఈ వాస్తవాన్ని ఈనాడు ప్రస్తావించనే లేదు.  

రోడ్ల పనులు జరుగుతున్నాయి.. 
ఈనాడు కథనంలో 13 రోడ్లను పేర్కొంది. ఇందులో 9 రహదారులు ఆర్‌అండ్‌బీ విభాగానికి చెందినవి. అందులో 6 రోడ్ల మరమ్మతు పనులు వేగవంతంగా సాగుతున్నాయి. మిగిలిన మూడు రోడ్ల పనులను కూడా త్వరలోనే చేపట్టేందుకు ఆర్‌అండ్‌బీ కార్యాచరణ వేగవంతం చేసింది.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మెరుగ్గా రోడ్ల నిర్మాణం 
టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో రోడ్ల మరమ్మతు పనులకు రూ. 2,953.81 కోట్లు ఖర్చు చేసింది. అంటే  ఏడాదికి సగటున రూ. 591 కోట్లు వెచ్చించింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నాలుగేళ్లలోనే రోడ్ల పునరుద్ధరణకు రూ. 4,148.59 కోట్లు ఖర్చు చేసింది. అంటే ఏడాదికే సగటున రూ. 951 కోట్లు వెచ్చించింది. ప్రస్తుత ఆర్థిక సంవ­త్సరం నాలుగు నెలల్లోనే రూ. 346 కోట్లు ఖర్చు చేసింది.

ఇక పంచాయతీరాజ్‌ శాఖ మరో రూ. 283 కోట్లతో రోడ్లు నిర్మించింది. రోడ్ల నిర్మాణం, పునరుద్ధరణ కోసం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం భారీ­గా నిధులు వెచ్చించి సకాలంలో పనులు పూర్తి చేస్తున్నా సరే తన మనిషి చంద్రబాబు సీఎంగా లేరన్న అక్కసుతో రామోజీరావు వైఎ­స్సా­ర్‌సీపీ ప్రభుత్వంపై దు్రష్పచారం చేస్తున్నారు.   

మరిన్ని వార్తలు