ఎఫ్‌ఆర్‌ఎంబీ నిబంధనల ప్రకారమే ఏపీకి రుణాలు: దువ్వూరి కృష్ణ 

19 Dec, 2023 19:08 IST|Sakshi

సాక్షి, విజయవాడ: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు ఏపీ సీఎం స్పెషల్‌ సెక్రటరీ దువ్వూరి కృష్ణ. ఎఫ్‌ఆర్‌ఎంబీ నిబంధనల ప్రకారమే రుణాలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఈ లెక్కలన్నీ కాగ్‌, ఆర్‌బీఐ ధృవీకరించినవే అని స్పష్టం చేశారు. 

కాగా, దువ్వూరి కృష్ణ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ఆర్థిక పరిస్థితిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. పదేపదే ఆర్థిక పరిస్థితిపై ప్రజలకు తప్పుడు ప్రచారం చేస్తే వారు నమ్ముతారని భావిస్తున్నారు. జర్నలిస్టులు కూడా విలువలు పాటించకుండా తప్పుడు వార్తలు రాస్తున్నారు. ఆర్‌బీఐ నివేదిక ప్రకారం రాష్ట్ర విభజన నాటికి ప్రభుత్వ అప్పులు రూ. 1,18,050 కోట్లు కాగా, టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో రూ.2.71 లక్షల కోట్లకి అప్పు చేర్చింది. 

ఇక, 2023 మార్చి నాటికి ఏపీ అప్పులు రూ.4కోట్లకు చేరుకున్నాయి. టీడీపీ హయాంలో ప్రతీ ఏటా 20 శాతం అప్పు పెరగగా.. ఈ ప్రభుత్వంలో ఏటా పెరిగిన అప్పు 15.42 శాతం మాత్రమే. ఏపీ రుణాలన్నీ ప్రస్తుత ప్రభుత్వానికి ఆపాదించడం సరికాదు. ఎఫ్‌ఆర్‌ఎంబీ నిబంధనల ప్రకారమే రుణాలు తీసుకుంటున్నాం. ఈ లెక్కలన్నీ కాగ్‌, ఆర్‌బీఐ ధృవీకరించినవే. 

విద్యుత్‌ డిస్కంల అప్పు విభజనకి ముందు రూ.2893 కోట్లు అయితే టీడీపీ హయాంలో రూ.21,541కోట్లకి పెరిగింది. ఈ ప్రభుత్వంలో ఈ అప్పులు రూ.11,602 కోట్లకు అప్పులు తగ్గాయి. మొత్తం విద్యుత్‌ సంస్థల అప్పులు విభజన నాటికి 32,596.27 కోట్లు అయితే టీడీపీ హయాంలో రూ.91,137కోట్లకి పెరిగాయి. ఇక, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రూ.1,09,094 కోట్లకి మాత్రమే పెరిగాయి. 

విద్యుత్ పంపిణీ సంస్ధల అప్పులు గత ప్రభుత్వంలో 30.74 శాతం పెరిగితే ఈ ప్రభుత్వంలో 5.79 శాతం తగ్గాయి. రాష్ట్ర ప్రభుత్వం అనధికార అప్పులు చేస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రాజ్యాంగ విరుద్దంగా చట్ట విరుద్దంగా అప్పులు ఎలా చేయగలుగుతాం. కేంద్ర పరిమితులకి లోబడే అప్పులు. అన్ని నిబంధనలు పాటిస్తేనే బ్యాంకులు సైతం అప్పులు ఇస్తాయి. టీడీపీ ప్రభుత్వం ఏర్పడే నాటికి రూ.1,53,346 కోట్ల అప్పులు 2019 నాటికి రూ.4,12,288 కోట్లకి పెరిగాయి. టీడీపీ ఐదేళ్ల కాలంలో రూ.2,58,941 కోట్లు అప్పులు చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం హయాంలో అప్పులు పెరగలేదు. ఈనాడు పత్రిక రాసే వార్తల్లో నిజం లేదు. 


 

>
మరిన్ని వార్తలు