Fact Check: ఆర్టీసీపై ఇవేం అబద్ధాలు రామోజీ.. వాస్తవాలు ఇవిగో..

8 Nov, 2023 21:44 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి సాహసోపేత నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్‌పై ‘ఈనాడు’ విషం చిమ్ముతోంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై నిత్యం బురదజల్లడమే పనిగా పెట్టుకున్న రామోజీ మరో మారు తన నైజాన్ని చాటుకున్నారు. ఆర్టీసీకి ప్రతీ నెలా రూ.275 కోట్ల ఆర్ధిక సహాయాన్ని అందిస్తోన్న ప్రభుత్వంపై ‘డొక్కు బస్సులే దిక్కా’ అంటూ ఈనాడు పత్రిక ప్రచురించిన అవాస్తవ కథనాన్ని ఏపీఎస్‌ఆర్టీసీ ఖండించింది. ఇందులో నిజానిజాల్లోకి వెళితే..

2020 జనవరి 1 నుంచి ఇప్పటి వరకు రూ. 11,711 కోట్ల భారీ ఆర్థిక సహాయాన్ని అందించింది. కరోనా సమయంలో దేశంలోని అన్ని ఆర్టీసీల ఉద్యోగులు దయనీయమైన పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం ఇచ్చిన మద్దతుతోనే ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులు కరోనా కాలంలో ఆకలితో అలమటించే పరిస్థితి తప్పింది. ప్రభుత్వంలో విలీనం చేయకముందు ఏపీఎస్ ఆర్టీసీలో 693 కారుణ్య నియామకాలు జరిగాయి. విలీనం వల్ల ఏపీఎస్ఆర్టీసీలోని ఖాళీల మేరకు మాత్రమే కాకుండా ఇతర ప్రభుత్వ శాఖలలో కూడా మరణించిన కుటుంబాలకు కారుణ్య ఉపాధి లభించింది

PRC-2022 అన్ని ఇతర ప్రభుత్వ శాఖలతో సమానంగా అమలు చేయబడింది. విలీనం కారణంగా ఇప్పటి వరకూ 2,760 కోట్ల అప్పు తీరింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్టీసీ అత్యుత్తమ సేవలు అందించింది. 2019-20 ఆర్ధిక సంవత్సరం ఆర్టీసీ ఆదాయం 4,781 కోట్లు. 2022-23 ఆర్ధిక సంవత్సరం ఆర్టీసీ ఆదాయం 5,574 కోట్లు. దసరా,సంక్రాంతి పండుగల్లో అదనపు ఛార్జీలు వసూలు చేయకుండానే ఆదాయం వచ్చింది. 2019-20 సంవత్సరంలో 406 కొత్త బస్సులు కొనుగోలు చేసిన ఆర్టీసీ.. పాత బస్సుల స్థానంలో 900 కొత్త డీజిల్ అద్దె బస్సులను ప్రవేశపెట్టింది.

తిరుపతి-తిరుమల ఘాట్ రోడ్డు, తిరుపతి నుండి సమీప నగరాలకు నడపడానికి 2022-23లో 100 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టింది. కొత్తగా 1,500 డీజిల్ బస్సుల కొనుగోలు పురోగతిలో ఉంది. కేంద్రప్రభుత్వం ప్రకటించిన కొత్త స్క్రాప్ పాలసీ ప్రకారం 15 ఏళ్ల సర్వీసు పూర్తైన 214 బస్సులను ఆర్టీసీ రద్దు చేసింది. 2024 మార్చిలోపు మరో 52 బస్సులను రద్దు చేసే యోచనలో ఆర్టీసీ ఉంది. ప్రజల రవాణా కోసం ఏపీఎస్ ఆర్టీసీ బస్సులను అధ్వాన్న స్థితిలో నడుపుతోందని చెప్పడం సరికాదు. ప్రస్తుత సంవత్సరంలో ప్రజల ఆదరణ పెరిగింది. గతేడాది కంటే169 కోట్ల మేర అదనపు రాబడి వచ్చింది. డిపోలకు విడిభాగాల సరఫరాపై ఖర్చు భారీగా తగ్గిందని చెప్పడం సరికాదు.

2019-20 సంవత్సరంలో 163.11 కోట్లు చేసిన ఆర్టీసీ.. 2020-21 సంవత్సరంలో 91.65 కోట్లు, 2021-22 సంవత్సరంలో 168.51 కోట్లు, 2022-23 సంవత్సరంలో 231.29 కోట్లు విడిభాగాల సరఫరా కోసం ఆర్టీసీ ఖర్చు చేసింది. 110 కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా బస్ స్టేషన్ల పునరుద్ధరణ,కొత్త డిపోల నిర్మాణం ఆర్టీసీ చేపట్టింది. గతంతో పోలిస్తే ప్రమాదాలు గణనీయంగా పెరిగాయని చెప్పడం సరికాదు.. 2019-20 లో జరిగిన ప్రమాదాలు 974.. 2020-21లో జరిగిన ప్రమాదాలు 392.. 2021-22 లో జరిగిన ప్రమాదాలు 617..  2022-23 లో జరిగిన ప్రమాదాలు 907.

ఈ నెల 6వ తేదీన విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్‌లో జరిగిన ఘోర ప్రమాదంపై చర్యలు తీసుకున్నాం. ముగ్గురు సభ్యులతో కూడిన సీనియర్ అధికారుల కమిటీ విచారణ చేపట్టింది. డ్రైవర్ గేర్‌ను తప్పుగా ఎంచుకోవడం, యాక్సిలరేటర్‌ను గట్టిగా నొక్కడం వల్లే ప్రమాదం జరిగిందని కమిటీ నివేదించింది. ప్రమాదంలో ముగ్గురు మరణించారు.. ఒకరికి గాయాలయ్యాయి. ఘటనకు బాధ్యులైన బస్సు డ్రైవర్‌ను సస్పెండ్ చేశాం. డ్రైవర్‌కు తగిన శిక్షణ ఇవ్వడంలో విఫలమయ్యారనే కారణంతో ఆటోనగర్ డిపో అసిస్టెంట్ మేనేజర్ (ట్రాఫిక్) ను సస్పెండ్ చేశాం. మృతులకు ఒక్కొక్కరికి పది లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించాం. గాయాలపాలైవన వారి పూర్తి వైద్య సంరక్షణ బాధ్యత ఆర్టీసీ తీసుకుంటుంది. ఆర్టీసీ బస్టాండ్ లో ప్లాట్ ఫారానికి ఆనుకుని ఉన్న ప్రతి బస్ బేకు స్టాపర్ వాల్ ఎత్తు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం’’ అని ఆర్టీసీ పేర్కొంది.

అసత్యాన్ని ప్రచురించడం బాధ్యతారాహిత్యమే కాకుండా సాధారణ ప్రజలను తప్పుదోవ పట్టిస్తుంది. ఇటువంటి ప్రయత్నాలు ఆర్టీసీ సంస్థతో పాటు ఉద్యోగుల మనోధైర్యాన్ని దెబ్బతీస్తాయి. తప్పుడు సమాచారాన్ని ప్రచురించి, సంస్థ గౌరవానికి భంగం కలిగిస్తే పరువు నష్టం కేసు నమోదు చేస్తామని ఆర్టీసీ హెచ్చరించింది.
చదవండి: Fact Check: రోడ్డున పడ్డది రామోజీ పరువే..

మరిన్ని వార్తలు