రైతు సంఘాలతో ఫ్లిప్‌కార్ట్‌ జట్టు

26 Oct, 2021 05:35 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

నేరుగా రైతుల నుంచి వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లు

సాక్షి, అమరావతి: నేరుగా రైతుల నుంచే వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేసి విక్రయించేందుకు ఆన్‌లైన్‌ ఈ కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ ముందుకొచ్చింది. రైతులకు అధిక ఆదాయం కల్పించే విధంగా రైతు ఉత్పత్తి సంఘాలతో ఫ్లిప్‌కార్ట్‌ ఒప్పందం కుదుర్చుకుంటోంది. ఇందులో భాగంగా తొలుత అనంతపురం జిల్లాలోని సత్యసాయి ఫార్మర్‌ ఫెడరేషన్, ఆంధ్రప్రదేశ్‌ మహిళాభివృద్ధి సొసైటీ (ఏపీమాస్‌)తో ఒప్పందం కుదుర్చుకుంది. వీటినుంచి వేరుశనగ, పప్పు ధాన్యాలు, ఇతర మసాలా దినుసులను కొనుగోలు చేయనున్నట్టు ఫ్లిప్‌కార్ట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ స్ముృతి రవిచంద్రన్‌ ‘సాక్షి’కి తెలిపారు.

నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులను వినియోగదారులకు అందించడం కోసం విత్తనం నాటే సమయం నుంచి పంట ఉత్పత్తి అయిన తర్వాత ప్యాకింగ్‌ వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. ఆయా చోట్ల ప్యాకేజింగ్, ప్రాసెసింగ్‌ యూనిట్లను కూడా నెలకొల్పనున్నట్టు చెప్పారు. కాగా, మహిళా సాధికారతను పెంచేవిధంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ, టాటా ట్రస్ట్‌తో కలిసి పని చేస్తున్నట్టు ఫ్లిఫ్‌కార్ట్‌ ప్రతినిధి అలోక్‌ దే తెలిపారు. మహిళలు ఉత్పత్తి చేస్తున్న వ్యవసాయ, వ్యవసాయేతర ఉత్పత్తులకు ఆన్‌లైన్‌ ద్వారా మార్కెటింగ్‌ అవకాశాలను కల్పించనున్నట్టు పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు