మైనింగ్‌ సంస్కరణలతో మరింత పారిశ్రామికాభివృద్ధి

13 Nov, 2022 05:24 IST|Sakshi
చెన్నైలో ఇండియా సిమెంట్స్‌ ఎండీ శ్రీనివాసన్‌కు పుష్పగుచ్ఛం అందచేస్తున్న ఆర్థిక మంత్రి బుగ్గన

సిమెంట్‌ పరిశ్రమను ప్రోత్సహిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌  

ఇండియా సిమెంట్స్‌ ప్లాటినం జూబ్లీ వేడుకల్లో ఆర్థిక మంత్రి బుగ్గన 

సాక్షి, అమరావతి/చెన్నై: గనుల లీజుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరిన్ని సంస్కరణలు చేపడితే మరింత పారిశ్రామికాభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ పేర్కొన్నారు. ఇండియా సిమెంట్స్‌ ఏర్పాటై 75 ఏళ్లుపూర్తయిన సందర్భంగా చెన్నైలో శనివారం నిర్వహించిన ప్లాటినం జూబ్లీ వేడుకల్లో మంత్రి బుగ్గన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సున్నపురాయి వంటి కీలక ఖనిజాల లీజులకు సంబంధించి కేంద్ర ఎంఎండీఆర్‌ పాలసీలో కొద్దిపాటి మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. 1946లో 1.3 మిలియన్‌ టన్నుల సామర్థ్యంతో మొదలైన ఇండియా సిమెంట్స్‌ ప్రస్థానం... ఇప్పుడు 6 మిలియన్‌ టన్నులకు చేరిందని, దృఢమైన భారతజాతి నిర్మాణంలో ఈ సంస్థ కీలక భాగస్వామిగా నిలిచిందని అన్నారు.

ఇండియా సిమెంట్స్‌కు ఆంధ్రప్రదేశ్‌కు పటిష్టమైన బంధం ఉందని, రాష్ట్రంలో సిమెంట్‌ పరిశ్రమను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. ఇండియా సిమెంట్స్‌ ఎండీ ఎన్‌.శ్రీనివాసన్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, తమిళనాడు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి, కేంద్ర సహాయ మంత్రి ఎల్‌.మురుగన్, భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు