లో వోల్టేజీకిక చెక్‌!

5 Nov, 2020 04:57 IST|Sakshi

రూ.6,610.5 కోట్లతో 85 కొత్త ప్రాజెక్టులు 

ఎక్కడికక్కడ సబ్‌స్టేషన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, లైన్లు 

విద్యుత్‌ సరఫరా వ్యవస్థ మరింత బలోపేతం 

లోడ్‌ పెరిగినా లోవోల్టేజీ సమస్య ఉండదు 

సాక్షి, అమరావతి: ఉన్నట్టుండి విద్యుత్‌ బల్బులు డిమ్‌గా మారిపోవడం, ట్యూబ్‌లైట్లు ఆరిపోవడం, విద్యుత్‌ సరఫరా ఎక్కువ, తక్కువ కావడం వంటి సమస్యలు ఇక సమసిపోనున్నాయని విద్యుత్‌ అధికారులు చెబుతున్నారు. పట్టణాలతో పాటు గ్రామాల్లో సైతం విద్యుత్‌ లోవోల్టేజీ సమస్య తలెత్తదని అంటున్నారు. ఏపీ ట్రాన్స్‌కో రూ.6,610.5 కోట్ల వ్యయంతో 85 ప్రాజెక్టులను చేపడుతోంది. ప్రపంచబ్యాంక్‌తో పాటు పలు ఆర్థిక సంస్థలు సహకారంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టుల పురోగతిని ట్రాన్స్‌కో సీఎండీ శ్రీకాంత్‌ నాగులాపల్లి ‘సాక్షి’కి వివరించారు.  

► సబ్‌స్టేషన్లు, ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు, లైన్లు వేయడం కొత్త ప్రాజెక్టుల్లో ప్రధానంగా ఉన్నాయి. దీనివల్ల రాష్ట్రంలో ఎప్పుడు విద్యుత్‌ డిమాండ్‌ పెరిగినా లోవోల్టేజీ అన్న సమస్యే తలెత్తదు.  
► రాష్ట్రంలో ఏటా 20 శాతం మేర విద్యుత్‌ వినియోగం పెరుగుతోంది. దీనికి తోడు రాష్ట్రవ్యాప్తంగా 18 లక్షల పంపుసెట్లకు పీక్‌ అవర్స్‌లోనే విద్యుత్‌ అందిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పెరిగే లోడ్‌ను తట్టుకునేందుకు విద్యుత్‌ వ్యవస్థల బలోపేతం తప్పనిసరి.  
► ట్రాన్స్‌కో, తూర్పు, దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థలు (ఏపీఈపీడీసీఎల్, ఏపీఎస్పీడీసీఎల్‌), డిజాస్టర్‌ రికవరీ ప్రాజెక్టు (ప్రకృతి వైపరీత్యాలప్పుడు ఉపయోగపడేది), విశాఖ, చెన్నై ఇండ్రస్టియల్‌ కారిడార్‌ (వీసీఐసీ), గ్రీన్‌ ఎనర్జీ కారిడార్‌ (జీఈసీ) కొత్త ప్రాజెక్టుల్లో ప్రధానంగా ఉన్నాయి.  
► ఈ ప్రాజెక్టులకు ఇంటర్నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ రీ కన్‌స్ట్రక్షన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఫైనాన్షియల్‌ ఇనిస్టిట్యూషన్‌ (ఐబీఆర్‌డీ), ఏషియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌ (ఏఐఐబీ), ప్రపంచ బ్యాంకు వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు రుణాలు ఇచ్చేందుకు ముందుకొచ్చాయి. ఇప్పటికే కొంత భాగానికి పాలనపరమైన అనుమతులు కూడా లభించాయి.   

మరిన్ని వార్తలు