విజయవాడలో జడివాన బీభత్సం

9 Oct, 2020 19:09 IST|Sakshi

సాక్షి, విజయవాడ : విజయవాడలో శుక్రవారం సాయంత్రం కుండపోత వర్షం కురిసింది. గంటపాటు ఎడతెరిపిలేని జడివానతో విజయవాడలోని ప్రధాన కూడళ్లన్ని జలమయమయ్యాయి. వన్ టౌన్ రోడ్‌ ,బందర్ రోడ్ ,ఎంజే నాయుడు హాస్పిటల్ రోడ్ ,పాలీక్లినిక్ రోడ్ లతో పాటు పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. జడివాడతో జనజీవనం అస్తవ్యస్థంగా మారింది. రహదారులన్ని సెలయేళ్ళను తలపించాయి. భారీ వర్షంతో వాహనచోదకులు ,పాదచారులు తీవ్ర అవస్థలు పడ్డారు. విజయవాడ అండర్ బ్రిడ్జీల వద్ద మొకాలు లోతుకు వర్షపు నీరు చేరడంతో ట్రాఫిక్ స్తంభించి ద్విచక్ర వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

​కాగా ఉత్తర అండమాన్ సముద్రం దాని పరిసర ప్రాంతం, తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది. 24 గంటల్లో అల్పపీడనం వాయుగుండంగా బలపడనుందని పేర్కొంది. వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా పయనించి ఆదివారం సాయంత్రంలోగా తీరం దాటే అవకాశం ఉందని, దీని ప్రభావంతో ఈ రోజు అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

శనివారం అక్కడక్కడ పిడుగులతో కూడిన భారీ వర్షాలు,ఆదివారం పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. తీరం వెంబడి గంటకు 45-55 కి.మీ వేగంతో గాలుల వీస్తాయని, సముద్రం అలజడిగా ఉంటుందని పేర్కొంది. మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని.. తీరప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్‌ కె. కన్నబాబు హెచ్చరించారు.  

మరిన్ని వార్తలు