శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు

23 Sep, 2020 12:35 IST|Sakshi

సాక్షి, తిరుమల: తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా పలువురు ప్రముఖులు కలియుగ వైకుంఠ దైవం శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. మంత్రులు మేకపాటి గౌతమ్ రెడ్డి, చెల్లుబోయిన వేణు గోపాల్, పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి, కర్ణాటక ఎండోమెంట్ కమిషనర్ రోహిణీ సింధూరి తదితరులు బుధవారం స్వామివారి దర్శనం చేసుకున్నారు.

ఈ సందర్భంగా ఐటీ శాఖమంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి మాట్లాడుతూ స్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నామని, కోవిడ్‌ నుంచి ప్రజలకు విముక్తి కలగాలని దేవుడిని ప్రార్థించినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని వెంకన్నను మొక్కుకున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పథకాలతో ప్రజలకు అందిస్తున్న ఫలాలు చూసి ప్రధాన ప్రతిపక్షం రాక్షస ఆనందం పొందుతోందని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్‌ వ్యాఖ్యానించారు. పేదలకు ఉచిత ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సిద్ధం అవుతుంటే కోర్టులు ద్వారా అడ్డుకుని కుట్రలు చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి శ్రీవారి అనుగ్రహం ఉందని, డిక్లరేషన్‌ పేరుతో వివాదం చేసి అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆయన విమర్శించారు.

కర్ణాటక ఎండోమెంట్ కమిషనర్ రోహిణీ సింధూరి మాట్లాడుతూ ‘మైసూర్ మహారాజు కాలం నుండి తిరుమలలో 7 ఎకరాల్లో కర్ణాటక రాష్ట్ర ఛారిటీస్ ఉన్నాయి. 14 శతాబ్దం నుండి కర్ణాటక భక్తులు శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చేవారు. ప్రభుత్వం తరపున ప్రతిరోజు శ్రీవారికి నిత్య హారతి అందిస్తారు. 1964లో అప్పటి ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి కర్ణాటక సత్రాలకు భూమిపూజ చేశారు. ఇప్పుడు రూ.200 కోట్లతో తిరుమలలో కర్ణాటక ఛారిటీస్‌కు సంబంధించి 5 కాంప్లెక్స్‌లు నిర్మించనున్నాం. రోజుకు 1800 మంది భక్తులకు వసతి కలిగించేలా నిర్మాణం చేపట్టనున్నాం. రేపు ఉదయం 8.10 గంటలకు కర్ణాటక సత్రాల నూతన సముదాయానికి ఏపీ సీఎం వైఎస్‌ జగన్, కర్ణాటక సీఎం యడియూరప్ప భూమిపూజ చేయనున్నారు’ అని తెలిపారు.

ఇక అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ వరదుడు, సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఐదవ రోజు ఉదయం మోహినీ రూపంలో పల్లకిలో ఊరేగుతూ భక్తులకు ఏకాంతంగా దర్శనం ఇచ్చారు. క్షీరసాగర మథనం సమయంలో వెలువడిన అమృతాన్ని దేవతలు అందరికి దక్కేలా చేసిన అవతారమిది. సాక్షాత్తు పరమశివుడు సైతం సమ్మోహన పరిచిన  మోహినీ రూపంలో పల్లకీలో ఎదురుగా అద్దంలో తన ముగ్ద మనోహరమైన సుందర రూపాన్ని చూసి మురిసిపోతూ  ఊరేగుతూ పల్లకీలో ఊరేగుతూ భక్తులకు ఏకాంతంగా దర్శనమిచ్చారు.

మరిన్ని వార్తలు