ప్రారంభమైన మొబైల్‌ థియేటర్‌

26 Apr, 2022 04:39 IST|Sakshi
రాజానగరంలో ఏర్పాటు చేసిన మొబైల్‌ థియేటర్‌

29 నుంచి ‘ఆచార్య’ సినిమాతో రెగ్యులర్‌ షోలు

రాజానగరం: తూర్పు గోదావరి జిల్లా రాజానగరంలోని జీఎస్‌ఎల్‌ వైద్య కళాశాలకు సమీపాన హెబిటేట్‌ రెస్టారెంట్‌ పక్కన ఏర్పాటు చేసిన మొబైల్‌ థియేటర్‌ ప్రారంభమైంది. జీఎస్‌ఎల్‌ విద్యా సంస్థల చైర్మన్‌ డాక్టర్‌ గన్ని భాస్కరరావు సోమవారం దీనిని ప్రారంభించారు. ‘పిక్చర్‌ టైమ్‌’ సంస్థ ఏర్పాటు చేసిన ఈ థియేటర్‌ గ్రామీణ ప్రాంతాల వారికి ఐమాక్స్‌లో సినిమా చూస్తున్న అనుభూతిని కలిగిస్తుందని నిర్వాహకులలో ఒకరైన చైతన్య తెలిపారు.

ఇన్‌ఫ్లాటబుల్‌ అకోస్టిక్‌ మెటీరియల్‌ (గాలి నింపిన టెంట్‌)తో తయారైన ఈ థియేటర్‌ అన్ని వాతావరణ పరిస్థితులను, అగ్ని ప్రమాదాలను తట్టుకుంటుందన్నారు. 35 ఎంఎం స్క్రీన్‌తో, 120 సిటింగ్‌ సదుపాయంతో ఏర్పాటు చేసిన ఈ థియేటర్‌కి ఏడాది పాటు అనుమతులున్నాయని, ఈనెల 29న విడుదలయ్యే ఆచార్య సినిమాతో రెగ్యులర్‌ షోలు వేస్తామని చెప్పారు. ఆన్‌లైన్‌తోపాటు బుకింగ్‌ కౌంటర్‌లోను లభించే టికెట్లు.. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే లభిస్తాయన్నారు. ప్రారంభ కార్యక్రమంలో జీఎస్‌ఎల్‌ ప్రతినిధులు డాక్టర్‌ గన్ని సందీప్, డాక్టర్‌ జి. తరుణ్‌ తదితరులు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు