Sai Priya: పెళ్లిరోజు నాడే విషాదం.. ఆర్కే బీచ్‌లో వివాహిత గల్లంతు..

26 Jul, 2022 11:06 IST|Sakshi

ఎంవీపీ కాలనీ (విశాఖ తూర్పు): భర్తతోపాటు విహారానికి వచ్చిన ఓ వివాహిత ఆర్కేబీచ్‌లో గల్లంతైంది. ఈ ఘటనపై త్రీటౌన్‌ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎన్‌ఏడీ ప్రాంతానికి చెందిన ఎన్‌.సాయిప్రియ భర్త శ్రీనివాస్‌తో కలిసి సోమవారం రాత్రి ఆర్కేబీచ్‌కు విహారానికి వచ్చింది. తీరంలో కొంతసేపు గడిపిన అనంతరం 7.30 గంటల సమయంలో తిరిగి వెళ్లిపోవడానికి సిద్ధమయ్యారు.

ఈ క్రమంలో కాళ్లు కడుక్కోవడానికి సాయిప్రియ తీరానికి వెళ్లినట్లు భర్త శ్రీనివాస్‌ పోలీసులకు తెలిపారు. ఆ సమయంలో తాను సరిగ్గా వెనుకవైపు గమనించలేదని, కొంతసేపటికి తిరిగి చూస్తే తాను కనిపించలేదని అతను వెల్లడించినట్లు పోలీసులకు తెలిపారు. దీంతో ఆమె బీచ్‌లో గల్లంతై వుంటుందని భావిస్తున్నారు. విశాఖ ఆర్కే బీచ్ వద్ద నిన్న గల్లంతు అయిన వివాహిత సాయి ప్రియ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పెళ్లిరోజు కావడంతో భర్త శ్రీనివాసుతో కలిసి సాయి ప్రియ నిన్న ఆర్కే బీచ్ కు వెళ్లారు. అయితే విచారణ అనంతరం పూర్తి వివరాలు తెలియజేస్తామని త్రీటౌన్‌ సీఐ రామారావు తెలిపారు.

మరిన్ని వార్తలు