‘పులివెందులలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అకాడమీ ఏర్పాటు’

15 Jul, 2021 18:39 IST|Sakshi

నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

అమరావతి: ‘నైపుణ్య యువాంధ్రప్రదేశ్’ దిశగా వడివడిగా రాష్ట్ర ప్రభుత్వ అడుగులు వేస్తోందని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. వరల్డ్ స్కిల్ యూత్ డే సందర్బంగా ఆయన యువతీ,యువకులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ పత్రికా ప్రకటనల విడుదల చేశారు. 'ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం ఉన్న యువత ఈ దేశానికి అవసరం' అని బోధించిన వివేకానందుడి మాటల్లోని పరమార్థాన్ని గ్రహించి రాష్ట్ర యువతలో నైపుణ్యాలు పెంపొందించేందుకు తగు శిక్షణను అందించాలనేదే ధ్యేయమని తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించడం కోసం నైపుణ్యాభివృద్ధి శిక్షణను ఉచితంగా అందజేయడాలన్నదే ప్రభుత్వ సంకల్పమని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభించినా నెంబర్ వన్ స్కిలింగ్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందన్నారు.

2లక్షల మందికి నైపుణ్య శిక్షణ ఇచ్చి "ఇంటర్నేషనల్ జీనియస్ బుక్ ఆఫ్ రికార్డు"ల్లోకి ఎక్కిందన్నారు. ఇటీవల సీఎం జగన్‌ చేతుల మీదుగా వైఎస్సార్‌ కడప జిల్లాలోని పులివెందులలో రూ.30కోట్లతో 'స్కిల్ డెవలప్మెంట్ అకాడమీ' ఏర్పాటుకు శంకుస్థాపనతో కీలక ముందడుగు వేశామని తెలిపారు. రాష్ట్ర ప్రగతిని ప్రభావితం చేసే అంశాల్లో మానవ వనరులదే కీలకమైన పాత్ర అని, నేటి ఆధునిక సాంకేతిక యుగంలో నైపుణ్యాలు కలిగిన యువతకు మాత్రమే ఉపాధి అవకాశాలు లభిస్తుందని ముందే గుర్తించడం సీఎం జగన్‌ దార్శనికతకు నిదర్శనమన్నారు. రేపటి భవిష్యత్తుకు బాటలు వేసే బాధ్యతలను తమ భుజస్కంధాలపై మోసే యువతలో నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రతీ ఏడాదీ జూలై 15న 'ప్రపంచ యువత నైపుణ్యాల దినోత్సవం' నిర్వహించుకోవడం సముచితమని తెలిపారు.

నైపుణ్యం ఉంటేనే యువతకు ఉద్యోగాలు వస్తాయిని, ఆ నైపుణ్యాన్ని ఉచితంగా యువతకు అందించేందుకు ఏపీ ప్రభుత్వం బాటలు వేస్తోందని తెలిపారు. ఏ రంగంలో నైపుణ్యం కలిగిన మానవులు కావాలో చెప్పండి తామే శిక్షణ ఇచ్చి నైపుణ్యంతో కూడిన మానవ వనరులు సమకూరుస్తామనేలా ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. ఉపాధి కల్పన లక్ష్యంగా లోక్ సభ నియోజకవర్గానికి ఒకటి చొప్పున రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే 25 నైపుణ్య కళాశాలలు ఏర్పాటు చేస్తునట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ట్రిపుల్ఐటీలలో ఒక్కొక్కటి చొప్పున 4 స్కిల్ కాలేజీలు, రాష్ట్ర ప్రభుత్వం 30 నైపుణ్య కళాశాలలు, ఒక విశ్వవిద్యాలయం ఏర్పాటు కోసం రూ1,385 కోట్లను వెచ్చించేందుకు సన్నద్ధంగా ఉందని పేర్కొన్నారు.7 నెలల కాలంలోనే రాష్ట్రవ్యాప్తంగా శిక్షణ తీసుకొని 156 ప్రముఖ ఎమ్ఎన్‌సీ  కంపెనీలలో ఉపాధి పొందిన యువత 4,500 మంది అని తెలిపారు.

2021-22లో 5వేల మందికి ఒక్క ఓమ్ క్యాప్ ద్వారా ఉపాధి అవకాశాలు అందించాలనేది లక్ష్యంమని, స్కిల్ కాలేజీలలో యువతీ, యువకులు, విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అందించే వీలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ 24 జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు చేసుకుందని తెలిపారు.ఆ జాబితాలో ఐబీఎమ్,టెక్ మహీంద్రా, హెచ్ సీఎల్, బయోకాన్, ఒరాకిల్ తదితర ప్రముఖ సంస్థలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రతి స్కిల్ కాలేజ్‌లో పరిశ్రమలో పనిచేసేందుకు అవసరమైన శిక్షణ ఇచ్చేలా 'సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్'లకు శ్రీకారం చేట్టినట్లు తెలిపారు. పరిశ్రమలలో స్థానిక యువతకే 75 శాతం ఉద్యోగాలు అందించేందుకూ ప్రభుత్వం శ్రీకారం చుట్టినట్లు మంత్రి గుర్తు చేశారు.

రాష్ట్రంలో నైపుణ్యాల అభివృద్ధికి జరుగుతున్న వివిధ కార్యక్రమాల సమన్వయం, నైపుణ్యం కలిగిన మానవ వనరుల డిమాండ్- సప్లైల మధ్య అంతరాన్ని నిర్మూలించడం, సాంకేతిక, వృత్తిపరమైన శిక్షణా కార్యక్రమాల నిర్వహణ, కొత్త నైపుణ్యాలను ప్రవేశపెట్టడం, వినూత్నమైన ఆలోచనా ధోరణిని ప్రోత్సహించడం లాంటి విధులను వర్తమానానికే గాక భవిష్యత్తులో కూడా పనికొచ్చే విధంగా కృషి చేస్తున్న నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖకు శుభాభినందనలు తలియజేశారు. 

మరిన్ని వార్తలు