-

చంద్రబాబు హయాంలో భారీగా భూకబ్జాలు: అవంతి

13 Jun, 2021 11:33 IST|Sakshi

భూ కబ్జాలపై చంద్రబాబు స్పందించాలి

టీడీపీ నేతలు కబ్జా చేసిన భూములను పేదలకు పంపిణీ చేస్తాం

మంత్రి అవంతి శ్రీనివాస్‌

సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు హయాంలో విశాఖలో భారీగా భూకబ్జాలు జరిగాయని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, టీడీపీ నేతలపై కక్షసాధింపునకు దిగాల్సిన అవసరం తమకు లేదని.. తమది పేదల సంక్షేమం కోసం పనిచేసే ప్రభుత్వమని స్పష్టం చేశారు. ప్రభుత్వ భూముల ఆక్రమణలను చంద్రబాబు సమర్థిస్తారా? అని అవంతి ప్రశ్నించారు.

ఎంతటివారైనా చర్యలు తప్పవు..
ప్రభుత్వ భూములు ఆక్రమించిన వారు ఎంతటివారైనా చర్యలు తప్పవన్నారు. టీడీపీ నేతల భూ కబ్జాలపై చంద్రబాబు స్పందించాలని ఆయన డిమాండ్‌ చేశారు. గడిచిన రెండేళ్లలో విశాఖలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని.. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే తమ ఉద్దేశమని మంత్రి అవంతి పేర్కొన్నారు.

సిట్‌ నివేదిక బయటపెడతాం..
‘‘విశాఖ భూముల కుంభకోణంపై సిట్‌ నివేదిక బయటపెడతాం. పల్లా సింహాచలం అండ్‌కో రూ.700 కోట్ల విలువైన భూకబ్జా చేశారు. ప్రభుత్వ భూమి కబ్జాతోపాటు కొంత భూమిని అమ్మేశారు. టీడీపీ నేతలు కబ్జా చేసిన భూములను పేదలకు పంపిణీ చేస్తాం. త్వరలో ఎన్‌ఏడీ ఫ్లైఓవర్‌, భోగాపురం ఎయిర్‌పోర్ట్ నిర్మాణం పూర్తి చేస్తాం. బీజేపీ నేతలకు విశాఖపై ప్రేమ ఉంటే రైల్వే జోన్‌ తీసుకురావాలని’’ మంత్రి అవంతి శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు.

ప్రభుత్వ భూముల్లోనే విశాఖ పరిపాలనా రాజధాని..
ప్రభుత్వ భూముల్లోనే విశాఖ పరిపాలనా రాజధాని నిర్మాణం జరుగుతుందని మంత్రి అవంతి అన్నారు. విశాఖ పరిపాలనా రాజధాని కోసం ప్రైవేట్‌ భూములు అవసరం లేదన్నారు. విశాఖలో ప్రభుత్వ భూములు పుష్కలంగా ఉన్నాయని మంత్రి తెలిపారు.

కబ్జాకు గురైన భూములను స్వాధీనం చేసుకుంటాం: ఎమ్మెల్యే అదీప్‌రాజు
విశాఖలో కబ్జాకు గురైన ప్రతి సెంటు భూమిని స్వాధీనం చేసుకుంటామని ఎమ్మెల్యే అదీప్‌రాజు అన్నారు. టీడీపీ నేత బండారు ఆక్రమణలు విశాఖ ప్రజలకు తెలుసన్నారు. టీడీపీ నేతలు బయటకు రాకుండా జూమ్‌లో విమర్శిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ, టీడీపీ హయాంలో విశాఖలో వందల ఎకరాలు కబ్జా చేశారని.. ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకోవడం తప్పా? అని ఆయన ప్రశ్నించారు.
 

చదవండి: రూ.30 కోట్ల జరిమానా ఎగ్గొట్టిన టీడీపీ నేత
నేడు, రేపు భారీ వర్షాలు 

మరిన్ని వార్తలు