ఏపీ ఎస్పీడీసీఎల్‌కు జాతీయ అవార్డు

12 Jan, 2022 05:07 IST|Sakshi
అవార్డుతో ఏపీ ఎస్పీడీసీఎల్‌ సీఎండీ హరనాథరావు

తిరుపతి రూరల్‌: విద్యుత్‌ వినియోగదారులకు మెరుగైన సేవలతో నిరంతరం నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తున్న ఆంధ్రప్రదేశ్‌ దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఏపీ ఎస్పీడీసీఎల్‌)కు జాతీయ స్థాయి అవార్డు లభించింది. ఇండియన్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ (ఐసీసీ) ఆధ్వర్యంలో మంగళవారం 15వ ఇంధన సదస్సును వర్చువల్‌ విధానంలో నిర్వహించారు.

విద్యుత్‌ పంపిణీలో ఆవిష్కరణల అంశంలో చేస్తున్న కృషిలో ఏపీ ఎస్పీడీసీఎల్‌ జాతీయ స్థాయిలో తృతీయ స్థానంలో నిలిచినట్లు ఈ సదస్సు తీర్మానించింది. ఈ సదస్సులో భాగంగా జరిగిన ఐసీసీ అవార్డులు–2022 ప్రదానోత్సవ కార్యక్రమం సందర్భంగా జ్యూరీ సభ్యుల నుంచి ఈ అవార్డును ఏపీఎస్పీడీసీఎల్‌ చైర్మన్‌ – మేనేజింగ్‌ డైరెక్టర్‌ హెచ్‌.హరనాథరావు అందుకున్నారు. ఎస్పీడీసీఎల్‌కు జాతీయ అవార్డు లభించడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఉద్యోగుల అత్యుత్తమ పనితీరుకు నిదర్శనంగా జాతీయ అవార్డును సొంతం చేసుకున్నట్లు తెలిపారు. వినియోగదారులకు మరింత నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయడం ద్వారా సంస్థ మరెన్నో అవార్డులను అందుకోవాలని ఆకాంక్షించారు.  

మరిన్ని వార్తలు