కొత్త రకం కరోనాపై అప్రమత్తమైన ఆంధ్రప్రదేశ్‌

23 Dec, 2020 14:28 IST|Sakshi

వెబ్ పోర్టల్లో నమోదు తర్వాతే అనుమతి

రాష్ట్ర వ్యాప్తంగా 21వేల ప్రత్యేక బృందాలు

సాక్షి, విజయవాడ : కరోనా కొత్త వైరస్‌పై అమ్రమత్తంగా ఉన్నామని ఆంధ్రప్రదేశ్‌ వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ అన్నారు. బ్రిటన్‌ నుంచి వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా తమ వివరాలని వైద్య ఆరోగ్యశాఖ వెబ్ పోర్టల్ లో నమోదు చేసుకోవాలని, లేకపోతే వారిని రాష్ట్రంలోకి అనుమతించం అని స్పష్టం చేశారు. ఏపీకి వచ్చే ప్రయాణికులపై పూర్తి స్థాయిలో మోనిటరింగ్ ఉందని, ఇప్పటికే యూకే  నుంచి వచ్చిన ప్రయాణికుల వివరాలు సేకరించడానికి రాష్ట్ర వ్యాప్తంగా 21 వేల బృందాలు క్షేత్రస్ధాయిలో పనిచేస్తున్నాయని వెల్లడించారు. బ్రిటన్లో వేగంగా వైరస్ వ్యాప్తి చెందుతోందని కేంద్రం హెచ్చరికలు జారీ చేయగా, ఇప్పటికే అన్ని‌జిల్లాల కలెక్టర్లకి తగిన ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. (వందేళ్ల తర్వాత సేమ్‌ సీన్‌ రిపీట్‌..! )

ఏపీకి సమీపంలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయాలలో ప్రత్యేక హెల్ప్‌ లైన్‌ డెస్కులను ఏర్పాటు చేసి,  బ్రిటన్‌ నుంచి వచ్చే ప్రయాణికులకు తప్పనిసరిగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఒకవేళ పాజిటివ్‌ అని తేలితే తప్పనిసరిగా హాస్పిటల్‌కు పంపించి చికిత్స అందించనుండగా, నెగటివ్‌ వచ్చిన వారు మరో 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలని  కాటమనేని స్పష్టం చేశారు. ఆ తర్వాత నిర్వహించే పరీక్షలో నెగిటివ్‌ అని వస్తేనే బయట తిరగడానికి అనుమతిస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం కేవలం బ్రిటన్లో మాత్రమే కొత్త స్ట్రెయిన్‌ వైరస్‌ వ్యాప్తి అధికంగా ఉందని, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, ఏపీ వ్యాప్తంగా పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నామని కాటమనేని భాస్కర్ తెలిపారు.  (అంటార్కిటికాలో ల్యాండ్‌ అయిన కరోనా)

మరిన్ని వార్తలు