ఏటా 8.50 లక్షల మంది చిన్నారులకు రక్ష

26 Aug, 2021 04:05 IST|Sakshi
న్యూమోకాకల్‌ వ్యాక్సినేషన్‌ ప్రారంభం సందర్భంగా చిన్నారిని లాలిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

న్యూమోనియా వ్యాధి నిరోధానికి న్యూమోకాకల్‌ వ్యాక్సిన్‌

క్యాంప్‌ కార్యాలయంలో ప్రారంభించిన సీఎం జగన్‌

సాక్షి, అమరావతి: ఐదేళ్లలోపు చిన్నారులకు వచ్చే అత్యంత ప్రమాదకరమైన న్యూమోనియా వ్యాధి నిరోధానికి రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ మొదలైంది. బుధవారం సీఎం వైఎస్‌ జగన్‌ క్యాంప్‌ కార్యాలయంలో లాంఛనంగా కార్యక్రమాన్ని ప్రారంభించారు. గురువారం నుంచి అన్ని జిల్లాల్లో వ్యాధి నిరోధక టీకాలు ఇచ్చే ఆరోగ్య ఉపకేంద్రాలన్నిటిలోనూ ఈ వ్యాక్సిన్‌ లభ్యమవుతుంది. ఏటా 8.50 లక్షల మంది చిన్నారులకు న్యూమోనియా నుంచి ఈ వ్యాక్సిన్‌ రక్షణనిస్తుంది.

పీసీవీ (న్యూమోకాకల్‌ వ్యాక్సిన్‌) పేరుతో ఇచ్చే ఈ టీకా..నెలన్నర వయసులో మొదటి డోసు, మూడున్నర మాసాల్లో రెండో డోసు, తొమ్మిది నెలలు పూర్తయ్యే లోపు మూడో డోసు వేయాల్సి ఉంటుంది. రాష్ట్రంలో 17 శాతం మంది శిశువులు న్యూమోనియాతోనే మృతి చెందుతున్నారు.  కేంద్రం ఈ వ్యాక్సిన్‌ను రాష్ట్రాలకు పంపిణీ చేస్తున్నది. ఇప్పటికే ఆరు రాష్ట్రాలకు పంపించగా.. తాజాగా మన రాష్ట్రానికి పంపిణీ చేసింది. ఇప్పటికే 11 రకాల వ్యాధి నిరోధక టీకాలు రాష్ట్రంలో వేస్తుండగా, న్యూమోనియా వ్యాక్సిన్‌ 12వదిగా నమోదైంది. కాగా, ఈ ఏడాది మన ఏపీలో మొదటి డోసు 5.45 లక్షల మందికి, రెండో డోసు 4.09 లక్షల మందికి, మూడో డోసు (బూస్టర్‌ డోసు), 68,188 మందికి వేయనున్నారని కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్‌ వివరించారు.  

మరిన్ని వార్తలు