ఆర్బీకేల పనితీరు బాగుంది

7 Jun, 2023 04:34 IST|Sakshi

స్వచ్ఛ భారత్‌ మిషన్‌ సంయుక్త కార్యదర్శి, జలశక్తి శాఖ డైరెక్టర్‌ జితేంద్ర శ్రీవాత్సవ ప్రశంస 

జగనన్న హౌసింగ్‌ కాలనీలో ఇళ్ల నిర్మాణ పనులపై వాకబు 

సచివాలయాల వ్యవస్థ, కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుతీరుపైనా ఆరా

భీమడోలు: రైతులకు అనేక రకాల సేవలందిస్తున్న రైతు భరోసా కేంద్రాల పనితీరు బాగుందని స్వచ్ఛ భారత్‌ మిషన్‌ సంయుక్త కార్యదర్శి, జలశక్తి శాఖ డైరెక్టర్‌ జితేంద్ర శ్రీవాత్సవ కొనియాడారు. స్వచ్ఛా­ంధ్ర మిషన్‌ కార్యక్రమంలో పారిశుధ్య పనులను సమర్థవంతంగా నిర్వహిస్తూ రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందిన ఏలూరు జిల్లా భీమడోలు, దుద్దేపూడి గ్రామ పంచాయతీలను మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ ఎండీ జె. వెంకట మురళీతో కలిసి జితేంద్ర శ్రీవాత్సవ సందర్శించారు.

ఇక్కడ అమలవుతున్న కార్యక్రమాల తీరును ఆయన క్షుణ్ణంగా పరిశీలించి సంతృప్తి వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుతీరును సంబంధిత అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. జగనన్న హౌసింగ్‌ కాలనీలో ఇళ్ల నిర్మాణ పనులపై హౌసింగ్‌ అధికారులను అడిగారు. అనంతరం సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అమలుచేస్తున్న సచివాలయ వ్యవస్థలోని ప్రతి విభాగం పనితీరు, అది ఏ విధంగా ఉపయోగపడుతున్నదీ వారి నుంచి అడిగి తెలుసుకున్నారు.

సచివాలయం, రైతుభరోసా కేంద్రం, వెల్‌నెస్‌ కేంద్రాలను ఆయన పరిశీలించారు. తొలుత సచివాలయాల్లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్, మత్స్యశాఖ సహాయకులు, ఇంజనీరింగ్‌ శాఖల సహాయకులు జాబ్‌చార్ట్‌తో పాటు వారు చేసే సేవలపై ఆరా తీశారు. మంచి స్పర్శ.. చెడు స్పర్శ (గుడ్‌ టచ్‌.. బ్యాడ్‌ టచ్‌) కార్యక్రమంపై నువ్వేం చేస్తావు.. అంటూ మహిళా కానిస్టేబుల్‌ని ప్రశ్నించగా.. ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభు­త్వం పకడ్బందీగా అమలుచేస్తోందని, తాను ఉన్నత పాఠశాలల బాలికలు, కళాశాలల్లో యువ­తులు, డ్వాక్రా మహిళలకు దీనిపై విస్తృత ప్రచారం చేస్తూ అవగాహన కలి్పస్తున్నానని ఆమె తెలిపింది.  

కియోస్క్‌ పనితీరుపై ఆరా.. 
ఆ తర్వాత రైతుభరోసా కేంద్రంలోని కియోస్క్‌ యంత్రాన్ని చూసిన ఆయన వీఏఏ (విలేజ్‌ అగ్రికల్చరల్‌ అసిస్టెంట్‌) రూప నుంచి ఈ యంత్రం ఏ విధంగా ఉపయోగపడుతుంది అని ఆరా తీశారు. కియోస్క్‌ యంత్రంలో రైతులు తమకు కావాల్సిన ఎరువులను బుక్‌ చేసుకుంటారని, వాటి నగదును చెల్లిస్తే రైతుల చెంతకే ఎరువులు చేరుకుంటాయని ఆమె వివరించారు.

రైతులకు మద్దతు రేటుకే అందుబాటులో ఉంటున్నాయని, ఈ విధానంలేని తరుణంలో రైతులు దళారుల వద్ద ఎక్కువ రేటుకు కొనుగోలు చేసుకునేవారని ఎండీ జె. వెంకటమురళి ఆయనకు వివరించారు. అక్కడే ఉన్న సర్పంచ్‌ పాము సునీతామాన్‌సింగ్‌ను కియోస్క్‌ యంత్రం రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతోందని ప్రశ్నించారు. ఆర్బీకే సేవలవల్ల రైతులు సంతృప్తికరంగా ఉన్నారని, ఈ విధానం లేనప్పుడు రైతులు సాగుకు తీవ్ర ఇబ్బందులు పడేవారని సర్పంచ్‌ వివరించారు.

దీంతో రైతుభరోసా కేంద్రాల పనితీరు బాగుందని, రైతులకు సంతృప్తికరమైన సేవలు అందుతాయని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా సచివాలయ ప్రాంగణంలో జితేంద్ర శ్రీవాత్సవ మొక్కలు నాటారు. నూజివీడు సబ్‌కలెక్టర్‌ ఆదర్శ్‌ రాజేంద్రన్, ఈడీ ఊరి్మళాదేవి, జెడ్పీ సీఈఓ కేవీఎస్‌ఆర్‌ రవికుమార్, డీపీఓ ఏవీ విజయలక్షి్మ, ఎంపీపీ కనమాల రామయ్య, జెడ్పీటీసీ తుమ్మగుంట భవానీరంగ, కేంద్ర, రాష్ట్ర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు