Fact Check: ఆర్బీకేలపై ఎందుకంత అక్కసు!?

9 Oct, 2023 04:58 IST|Sakshi

విత్తు నుంచి విక్రయం వరకు రైతుకు అండగా ఆర్బీకేలు 

గతంలో రోజుల తరబడి పడిగాపులు.. నేడు సీజన్‌కు ముందుగానే పంపిణీ 

ముందస్తు రబీ కోసం ఆర్బీకేల్లో విత్తనాలు, ఎరువులు 

నాలుగేళ్లలో రెండు కోట్లమందికి పైగా సేవలు 

అనతికాలంలోనే అంతర్జాతీయ ఖ్యాతి.. కేంద్రంతో సహా విదేశీ ప్రముఖుల ప్రశంసలు 

ఆర్బీకేల సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు పోటీపడుతున్న రాష్ట్రాలు 

రాష్ట్ర ప్రభుత్వంతో ఇథియోపియా ఒప్పందం 

దేశంలోనే యూఎన్‌ చాంపియన్‌ అవార్డుకు నామినేట్‌ 

ఆర్బీకేల స్ఫూర్తితో జాతీయస్థాయిలో పీఎం సమృద్ధి కేంద్రాలు 

ఇంత ఘనత సాధించిన వీటిపై పనిగట్టుకుని బురదజల్లుతున్న ఈనాడు 

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రైతు­లకు చేస్తున్న మంచి ఏదీ రామో­జీ­రావుకు కనిపించదు. కనిపించినా కనిపించనట్లు.. చూసినా చూడనట్లు నటి­స్తారు. ఎందుకంటే.. అధికా­రంలో ఆయన ఆత్మబంధువు చంద్ర­బాబు లేడు కాబట్టి. ఆయనే కనుక ఉంటే ఆయనెన్ని తప్పులు చేసినా అవి సూపర్‌గానే కని­పిస్తాయి. తన జర్నలిజం మార్కు ఇదేనని రామోజీ నిత్యం నిరూపించుకుంటూనే ఉన్నారు. ఎందుకంటే.. తాజాగా ఆదివారం సంచికలో ‘ఇదా భరోసా సిగ్గు.. సిగ్గు’ అంటూ రైతుభరోసా కేంద్రాలపై రామోజీ నిస్సిగ్గుగా విషం కక్కిన తీరు ఈ కోవకు చెందినదే.

వైఎస్సార్‌ రైతుభరోసా (ఆర్బీకే) కేంద్రాలు.. గ్రామస్థాయిలో ప్రభుత్వానికి, రైతులకు మధ్య వారధిలా పనిచేస్తుంటే.. విత్తు నుంచి విక్రయం వరకు రైతులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తుంటే ఈనాడుకు కంటిమీద కునుకు కరువైంది. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు, రైతుల అభ్యున్నతికి అవి పాటుపడుతూ నాలుగేళ్లలో వ్యవ­సాయ, అనుబంధ రంగాల్లో స్పష్టమైన మార్పునకు నిలువెత్తు నిదర్శనంగా కళ్లెదుట సాక్షాత్కరిస్తుండడంతో పచ్చ మీడియాకు దిక్కుతోచడంలేదు.

విత్తు నుంచి విక్రయం వరకు రైతులకు విస్తృతమైన సేవలందిస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. రైతులకు అన్ని విధాలుగా భరోసా కల్పిస్తుంటే మెచ్చుకోవాల్సింది పోయి.. ఆ వ్యవస్థే వృధా అన్నట్లుగా నిత్యం బురదజల్లడమే పనిగా పెట్టుకుంది ఈనాడు. నిజానికి.. రబీ సీజన్‌ కోసం ముందస్తుగా ఓ వైపు ముమ్మరంగా విత్తన పంపిణీ జరు­గు­తోంది.. ఎరువులు పుష్కలంగా ఉన్నాయి.. పురుగు మందుల పంపిణీకి ఏర్పాట్లు జరుగుతు­న్నాయి.. అయినా అవేమీ రామోజీకి కన్పించడంలేదు.

ఎక్కడా ఏ ఒక్క రైతు తమకు విత్తనం అందడంలేదని కానీ, ఎరువు దొరకడం లేదంటూ కనీసం ఫిర్యాదు కాదు కదా రోడ్డెక్కిన పాపాన కూడా పోలేదు.  ఆర్బీకేలకు వస్తున్న ఈ ఆదరణను చూసి ఓర్వలేక రామోజీ కల్లుతాగిన కోతిల వెర్రెక్కిపోతున్నారు.  ‘ఇదా భరోసా సిగ్గు.. సిగ్గు’ కథనంపై ‘ఫ్యాక్ట్‌చెక్‌’ చదవండి..

ఆరోపణ: నామమాత్రమైన ఆర్బీకేలు..
వాస్తవం: రైతులకు గ్రామస్థాయిలో సకాలంలో సమర్థవంతమైన, నాణ్యమైన సేవలను అందించాలన్న లక్ష్యంతో ఏర్పాటైన ఆర్బీకేలు రైతుల ఆదరణ చూరగొంటున్నాయి. గతంలో వ్యయ­ప్రయాల కోర్చి మండల కేంద్రాలకు వెళ్లి ఎండనక, వాననక, పగలనకా, రేయనకా నిద్రాహా­రాలు మాని విత్తనాలను, ఎరువులను పురుగుల మందుల కోసం పడిగాపులు కాస్తే కాని దొరికే పరిస్థితి ఉండేది కాదు.

కానీ, ప్రస్తుతం చూద్దామంటే నాలుగేళ్లలో క్యూలైన్‌ అనేది కన్పించలేదు. పైగా గతంలో తమ పార్టీ నేతలు, సానుభూతిపరులైన భూస్వాములు, రైతులకు పంచగా, మిగిలినవి సన్న, చిన్నకారు రైతులకు విదిల్చేవారు. ప్రస్తుతం వివక్షకు తావులేకుండా అడిగిన ప్రతీ రైతుకు అవసరమైన మేరకు ఎరువులు, విత్తనాలు పంపిణీ చేస్తున్నారు.

ఆరోపణ: పురుగు మందుల జాడేది?
వాస్తవం: ఆర్బీకేల ద్వారా మూడేళ్లలో 1,50,822 మంది రైతులకు రూ.14 కోట్ల విలువైన 1.36 లక్షల లీటర్ల పురుగు మందులను ఆర్బీకేల ద్వారా పంపిణీ చేశారు. వచ్చే సీజన్‌ కోసం సర్టిఫై చేసిన సస్యరక్షణ మందులు, సూక్ష్మ పోషకాల పంపిణీకి ఏర్పాట్లుచేస్తున్నారు. ఇంతవరకు పురుగు మందులను కేవలం వివిధ పథకాల కింద మాత్రమే పంపిణీ చేయగా, 2023 రబీకాలం నుంచి ఎరువుల మాదిరిగా పురుగు మందులను కూడా సాధారణ పద్ధతిలో పంపిణీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఇవేమీ రామోజీకి కన్పించడంలేదు.

ఆరోపణ: అక్కరకు రాని ఆర్బీకేలు..
వాస్తవం: నిజానికి.. ఆర్బీకేల ఏర్పాటుతో వ్యవ­సాయ రంగంలో స్పష్టమైన మార్పు కన్పిస్తోంది. కేవలం సాగు ఉత్పాదకాలు రైతు ముంగిట అందించడమే కాదు.. సర్టిఫై చేసిన నాణ్యమైన ఉత్పా­దకాల పంపిణీతో పాటు రైతుల్లో సామ­ర్థ్యం పెంపు, పరిశోధనా ఫలాలు రైతు క్షేత్రాలకు చేరవేయడం, పంట ఉత్పత్తుల కొనుగోలు వంటి కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహిస్తోంది. ఈ–క్రాప్‌ బుకింగ్, రైతు సంక్షేమ పథకాల అమలులో ఆర్బీకేలు క్రియాశీలకంగా వ్యవహరి­స్తున్నాయి.

ఆర్బీకేల ద్వారా కళ్లాల వద్దే పంట ఉత్ప­త్తుల కొనుగోలుకు శ్రీకారం చుట్టారు. ఇప్పటి­వరకు 45,226 కోట్ల విలువైన ధాన్యం, ఇతర పంట ఉత్పత్తులను 26.55 లక్షల మంది రైతుల నుంచి కొనుగోలు ఈనాడుకు కన్పించక­పోవడం విడ్డూరం. ధరలు పతనమైన ప్రతీసారి మార్కెట్‌ ఇంటర్‌వెన్షన్‌ కింద బహిరంగ మార్కె­ట్‌లో జోక్యం చేసుకుని వ్యాపారులతో పోటీపడి రైతులకు కనీస మద్దతు ధర దక్కేలా కృషిచేస్తున్నారు.

ఆరోపణ: ఆర్బీకేలకు రూ.మూడువేల కోట్లు వెచ్చించినా..
వాస్తవం: రాష్ట్రంలో 10,778 ఆర్బీకేలను ఏర్పాటు­చేయగా, వాటిలో 542 గ్రామాల్లో సొంత భవనాలుండగా 10,236 ఆర్బీకే భవనాల నిర్మాణం చేపట్టారు. వాటిలో 3,947 భవనాల నిర్మాణం పూర్తికాగా.. 2,948 భవనాలను ఇప్పటికే వ్యవసాయ శాఖకు అప్పగించారు. మరో 5,212 భవనాలు వివిధ దశల్లో ఉండగా, మిగిలిన 1,077 భవనాల నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకున్నారు. ఇప్పటివరకు భవ­నాల కోసం రూ.944 కోట్లు, మౌలిక సదుపా­యాల కల్పన కోసం రూ.343 కోట్లు ఖర్చు­చేశారు. కియోస్క్‌ల పనితీరును ప్రత్యేక డాష్‌­బోర్డు ద్వారా పర్యవేక్షిస్తున్నారు.

ఏపీ ఫైబర్‌నెట్, మొబైల్‌ ఇంటర్నెట్‌ ద్వారా కియోస్క్‌లకు ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పించారు. 94 శాతం కియోస్క్‌లు పూర్తిస్థాయిలో పనిచేస్తూ రైతులకు సేవలందిస్తున్నాయి. రెండు విడతల్లో నియమించిన 6,246 వ్యవసాయ, 4,655 పశుసంవర్థక, 2,356 ఉద్యాన, 731 మత్స్య, 377 పట్టు సహాయకులతో పాటు అనుభవ­జ్ఞులైన బహుళార్ధ, వ్యవసాయ విస్తరణ అధికారు­లతో పాటు గోపాలమిత్రలు సేవలందిస్తు­న్నారు. ప్రతీ ఆర్బీకేకు ఓ వలంటీర్‌తోపాటు బ్యాంకింగ్‌ కరస్పాండెంట్‌ను అనుసంధానం చేశారు.

ఆరోపణ: ఎరువుల అమ్మకాలు తూచ్‌..
వాస్తవం: ఆర్బీకేల్లో ఎరువుల అమ్మకం వ్యాపారం కాదని, రైతులకు గ్రామ­స్థాయిలో కల్పించిన ఓ సదుపాయం మాత్రమే. రాష్ట్రానికి సరఫరా అయ్యే ఎరువుల్లో 50 శాతం వ్యాపారులకు, మిగిలిన 50 శాతం సహకార కేంద్రాలు, ఆర్బీకేలకు కేటాయిస్తు­న్నారు. ఆర్బీకేలు ఏర్పాటుచేసిన తొలి ఏడాది 1.07లక్షల టన్నుల అమ్మకాలు జరగ్గా, మూడో ఏడాదికి వచ్చేసరికి అది దాదాపు నాలుగు లక్షల టన్నులకు చేరుకుంది. ఈ సదుపాయం వినియోగించుకున్న రైతుల సంఖ్య 2020–21లో 2.55 లక్షల మంది ఉంటే, 2022–23లో ఏకంగా 10.89 లక్షల మందికి చేరింది. అంటే.. 428 శాతం వృద్ధి కన్పిస్తోంది.

అలాగే, ఇప్పటివరకు రూ.1,196.07 కోట్ల విలువైన 10.83 లక్షల టన్నుల ఎరువులను 28.95 లక్షల మంది రైతులకు పంపిణీ చేశారు. 2023–24లో ఇప్పటివరకు ఆర్బీకేల ద్వారా 5.48 లక్షల మంది రైతులకు 2.13 లక్షల టన్నుల ఎరువులు పంపిణీ చేయగా, ఆర్బీకేల వద్ద 80వేల టన్నులు, సొసైటీల వద్ద 36 వేల టన్నుల ఎరువులు ఇంకా అందుబాటులో ఉన్నాయి. రైతు ముంగిట ఎమ్మార్పీకే అందుబాటులో ఉండడంతో బ్యాగ్‌పై రూ.20 చొప్పున ఈ నాలుగేళ్లలో రూ.50 కోట్లకు పైగా ఆదా అయ్యింది. ఇక సర్టిఫై చేసిన ఎరువుల పంపిణీవల్ల నకిలీ ఎరువులు, బ్లాక్‌ మార్కెటింగ్‌కు పూర్తిగా చెక్‌ పడింది.

ఆరోపణ: విత్తనాలు దొరకవు..
వాస్తవం: సీజన్‌కు ముందుగానే సర్టిఫై చేసిన నాణ్యమైన విత్తనాలను రైతులు బుక్‌ చేసు­కున్న 24 గంటల్లోపే వారికి  అందిస్తు­న్నారు. ఇలా ఈ నాలుగేళ్లలో 55.72 లక్షల మంది రైతులకు రూ.881.47 కోట్ల విలు­వైన 30.99 లక్షల క్వింటాళ్ల విత్తనా­లను రాయితీపై ఆర్బీకేల ద్వారా మాత్రమే పంపిణీ చేశారు. అంతేకాదు.. రూ.12.75 కోట్ల విలువైన మిరప, పత్తి, మొక్కజొన్న వంటి నాన్‌ సబ్సిడీ విత్తనాలను రైతులకు పంపిణీ చేశారు.

ఆరోపణ: ఆర్బీకేలకు గుర్తింపేది?
వాస్తవం: ఆర్బీకే వ్యవస్థ ఏర్పాటై మూడున్నరేళ్లు కావస్తోంది. అనతికాలంలోనే  ఆర్బీకేలు జాతీయ, అంతర్జాతీయ స్థా­యి ప్రముఖుల ప్రశంసలు పొందాయి. అంతర్జాతీయ ఖ్యాతిని గడించాయి. కేంద్ర వ్యవసాయ శాఖ, నీతి అయోగ్, ప్రపంచ బ్యాంకు ప్రతినిధి బృందం ప్రశంసలందుకు­­న్నాయి. యూఎన్‌ చాంపియన్‌ అవా­రు­్డ­కు నామినేట్‌ అయ్యాయి. ఆర్బీకే స్ఫూర్తి­తో జాతీయస్థాయిలో పీఎం సమృద్ధి కేంద్రాలను కేంద్రం ఏర్పాటుచేసింది.

ఆర్బీకే సాంకేతికత కోసం పొరుగు రాష్ట్రాలే కాదు.. దేశ, విదేశాలు సైతం పోటీపడు­తున్నాయి. ఇథియోపియా వంటి ఆఫ్రికన్‌ దేశం ఆర్బీకే సాంకేతికత కోసం రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కూడా చేసుకుంది. ఇలా ఆర్బీకేలు ఇన్ని వసతులను కల్పించి రైతుకు భరోసా ఇచ్చినా.. ఆర్బీకే వ్యవస్థను సిగ్గు సిగ్గు అని తక్కువ చేసి చూపడం రామోజీకే చెల్లింది. 

మరిన్ని వార్తలు