రీజెన్సీ సిరామిక్స్‌ పునరుద్ధరణ

22 Sep, 2023 04:58 IST|Sakshi
పునరుద్ధరించిన రీజెన్సీ సిరామిక్స్‌ టైల్స్‌ను ప్రారంభిస్తున్న రీజెన్సీ డైరెక్టర్‌ 

ట్రయల్‌ రన్‌ సక్సెస్‌ 

చెన్నయ్‌లో తొలి ఉత్పత్తి ప్రదర్శన 

మూడేళ్లలో ఆదాయ లక్ష్యం రూ.100 కోట్లు 

సాక్షి ప్రతినిధి, కాకినాడ: కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలోని రీజెన్సీ సిరామిక్స్‌ గురువారం పునఃప్రారంభమైంది. కార్మికుల వివాదాల నేపథ్యంలో దశాబ్దంన్నర క్రితం యానాం రీజెన్సీ లాకౌట్‌ ప్రకటించింది. అప్పటి నుంచి ఫ్యాక్టరీ పునరుద్ధరణకు చేస్తున్న ప్రయత్నాలు ఎట్టకేలకు కొలిక్కివచ్చాయి. ప్రయోగాత్మకంగా ఉత్పత్తి కూడా ప్రారంభమైంది. రీజెన్సీ సిరామిక్స్‌ను తిరిగి పూర్తిస్థాయిలో మార్కెట్‌లోకి తీసుకొచ్చేందుకు యాజమాన్యం ఏర్పాట్లు పూర్తిచేసింది. సంక్లిష్టమైన డిజైన్‌లకు మారుపేరుగా నిలిచిన రీజెన్సీ సిరామిక్స్‌ తొలిసారి రీజెన్సీ నేచురల్‌ టైల్స్‌ను చెన్నయ్‌లో విడుదల చేసింది.

రూ.70 కోట్ల ప్రారంభ పెట్టుబడితో ఉత్పత్తిని ప్రారంభించింది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు కంపెనీ నాలుగు టైల్స్‌ తయారీ లైన్లలో మొదటి దానిని ప్రారంభించేందుకు సిద్ధం చేసింది. కంపెనీ మొదటి లైన్‌ రోజుకు 7 వేల చదరపు మీటర్లను ఉత్పత్తి చేయనుంది. దీనిని రోజుకు 25 వేల చదరపు మీటర్ల సామర్థ్యానికి విస్తరించనున్నారు. అన్ని పరిమాణాలు, రకా­లు, గ్లేజ్డ్‌ విట్రిఫైడ్‌ టైల్స్, ఫుల్‌ బాడీ విట్రిఫైడ్‌ టైల్స్, పాలి‹Ù్డ విట్రిఫైడ్‌ టైల్స్, డబుల్‌ చార్జ్‌డ్‌ టైల్స్, వాల్‌ టైల్స్, ఎక్స్‌టీరియర్‌ టైల్స్, స్టెప్స్, రైజర్‌లలో ఉత్పత్తి చేయడానికి నిర్ణయించారు.

రీజెన్సీ ఉత్పత్తులను దేశంలోనే దక్షిణాది, తూ­ర్పు ప్రాంతాలకు విస్తరించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా రీజన్సీ డైరెక్టర్‌ నరాల సత్యేంద్రప్రసాద్‌ ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కేరళ, ఒడి­శా రాష్ట్రాల్లో వ్యాపారాన్ని విస్తరించనున్న­ట్టు చెప్పారు. వచ్చే మూడేళ్లలో రూ.100 కోట్లు ఆదాయం లక్ష్యంగా ఉత్పత్తిపై దృష్టి పెట్టా­మన్నారు. రాజధాని నగరాలతోపాటు  మిగిలిన నగరాల్లో షోరూంలు ఏర్పాటు చేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు. యానాంతోపాటు ఆంధ్రప్రదేశ్‌లో ఆరి్థక వ్యవస్థ బలోపేతంలో రీజెన్సీ భాగస్వామ్యం వహిస్తుందని ఆయన చెప్పారు.

మరిన్ని వార్తలు