ఉద్యోగ విరమణ చేసిన 11 ఏళ్ల తరువాత జీతం

30 Aug, 2021 09:15 IST|Sakshi
వృద్ధురాలికి పెండింగ్‌ జీతం అందిస్తున్న పంచాయతీ ఈవో రాంబాబు

చల్లపల్లి (అవనిగడ్డ): ఆ వృద్ధురాలు ఉద్యోగ విరమణ చేసి పదకొండేళ్లయ్యింది. అప్పటి నుంచి ఆమె పెండింగ్‌ జీతాన్ని గ్రామ పంచాయతీ అధికారులు ఇవ్వలేదు. ఆ డబ్బుల కోసం తిరిగి అలిసిపోయింది. ప్రస్తుతం ఆమె  అనారోగ్యానికి గురై జీవిత చరమాంకానికి చేరింది. ఆమె దీనస్థితిని బంధువులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ప్రస్తుత అధికారులు ఆమె జీతాన్ని వెంటనే అందించారు. కృష్ణా జిల్లా పురిటిగడ్డ గ్రామ పంచాయతీలో బుర్రే రాఘవమ్మ స్వీపర్‌ కం నైట్‌ వాచ్‌మన్‌గా పనిచేసి పదకొండేళ్ల క్రితం ఉద్యోగ విరమణ చేశారు. అప్పట్లో ఆమెకు రూ.53 వేల జీతం పెండింగ్‌ బకాయి ఉంది.

దీంతో పాటు రూ.78,171 పెన్షన్‌ కంట్రిబ్యూషన్‌ చెల్లించాల్సి ఉంది. అప్పట్లో పంచాయతీలో అధికారులు మారిన నేపథ్యం, పంచాయతీలో నిధుల కొరత కారణంగా ఆ మొత్తం ఆమెకు ఇప్పటికీ అందలేదు. ఈ సమస్యను ఆమె బంధువులు కలెక్టర్, డీపీవో, డీఎల్‌పీవో, జెడ్పీ సీఈవోల దృష్టికి తీసుకెళ్లారు. అధికారుల ఆదేశాల మేరకు పురిటిగడ్డ గ్రామ పంచాయతీ సర్పంచ్‌ రమ్య ఆధ్వర్యంలో పంచాయతీ ఈవో పిట్టి రాంబాబు వృద్ధురాలికి పెండింగ్‌ జీతం రూ.53 వేలు అందచేశారు. పెన్షన్‌ కంట్రిబ్యూషన్‌ కూడా వెంటనే చెల్లిస్తామని తెలిపారు.

ఇవీ చదవండి:
విషాదం: వరదలో కొట్టుకుపోయిన కారు.. నవవధువు గల్లంతు  
ఏపీ: ఆరు జిల్లాలకు భారీ వర్ష సూచన

మరిన్ని వార్తలు