శ్రీకాళహస్తి అన్నప్రసాదానికి ఐఎస్‌వో సర్టిఫికెట్‌ 

28 Jun, 2021 08:37 IST|Sakshi

శ్రీకాళహస్తి (చిత్తూరు జిల్లా): చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వరాలయంలో అన్నప్రసాదం నాణ్యత, శుభ్రతకు అంతర్జాతీయ ప్రమాణాల సంస్థ ‘ఐఎస్‌వో’ సర్టిఫికెట్‌ లభించింది. ‘హెచ్‌వైఎం’ సంస్థ ప్రతినిధులు ఆదివారం ఐఎస్‌వో ధ్రువపత్రాన్ని ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి చేతుల మీదుగా ఆలయానికి అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆలయంలో నిర్వహించే అన్నదాన కార్యక్రమానికి ఐఎస్‌వో సర్టిఫికెట్‌ లభించడం ఆనందంగా ఉందన్నారు.

ఆలయ ఈవో పెద్దిరాజు, సిబ్బందికి ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు. రక్షణ చర్యల్లో భాగంగా ఆలయానికి రెండు వైపులా రూ.34 లక్షల వ్యయంతో లగేజ్‌ స్కానర్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆలయానికి వచ్చే భక్తుల లగేజీని క్షుణ్ణంగా పరిశీలించి తరువాతే అనుమతిస్తామన్నారు. రానున్న రోజుల్లో శ్రీకాళహస్తీశ్వరాలయాన్ని దేశంలో అత్యున్నత స్థానానికి చేర్చేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి చెప్పారు.
చదవండి: మహిళా కూలీకి వజ్రం లభ్యం

మరిన్ని వార్తలు