Summer Season: వేసవి కాలం నోరూరించే మామిడిపండ్లు.. తినే ముందు ఇవి తెలుసుకోండి..

14 May, 2022 09:07 IST|Sakshi

పక్వానికి రాక ముందే రసాయనాలతో పండ్లు మగ్గిస్తున్న వైనం 

ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం 

జాగ్రత్తలు పాటించాలంటున్న వైద్య నిపుణులు

సాక్షి,ఆమదాలవలస రూరల్‌: వేసవి సీజన్‌ కావడంతో ప్రస్తుతం ఎక్కడ చూసినా మామిడిపండ్లే. ఎటువంటి మచ్చలు లేకుండా, చూడటానికి ఎంతో నాణ్యంగా ఉన్నా చాలావరకు అవి కృత్రిమంగా మగ్గబెట్టినవే. సహజసిద్ధంగా పండిన ఫలాల్లో మాత్రమే పోషకాలు ఉంటాయని, పక్వానికి రాని పండ్లను కృత్రిమ పద్ధతుల్లో రసాయనాలను వినియోగించి మగ్గబెట్టిన పండ్లను తింటే ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కొందరు వ్యాపారులు లాభార్జనే ద్యేయంగా ఆరోగ్యానిచ్చే పండ్లలో రసాయనాలు వినియోగించి ప్రజలకు అమ్మేస్తున్నారు. పైకి నిగనిగలాడుతూ చూడగానే నోరూరించే ఈ పండ్లను కొనుగోలు చేస్తూ అనారోగ్యం పాలవుతున్నారు. ప్రజారోగ్యం గురించి కనీసం పట్టించుకోని అధికారులు చూసీచూడనట్లు వదిలేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.  

తనిఖీలతోనే అడ్డుకట్ట.. 
మధురానుభూతిని కలిగించే మధుర ఫలాల వెనుక దాగి ఉన్న చేదు నిజాన్ని గుర్తించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పండ్లపై కార్బైడ్‌ వాడకాన్ని ప్రభు త్వం నిషేధించినా, కోర్టు లు ఆదేశించినా.. క్షేత్రస్థాయిలో వాటిని అమ లు చేసేవారే లేరు. దీంతో కొందరు వ్యాపా రులు పక్వానికి రాక ముందే పచ్చికాయలు కోసేసి వాటికి రసాయనా లు వినియోగించి పండ్లుగా మారుస్తున్నారు. గదిలో కార్‌సైడ్‌ వేసి మగ్గ పెట్టడం లేదా పొగపెట్టి మగ్గపెట్టడం, ఇథనాల్‌ వంటి రసాయనాల్లో ముంచి పచ్చికాయలను పండ్లుగా మార్చి మార్కెట్‌లో విక్రయిస్తున్నారు.

ప్రస్తుతం మామిడి సీజన్‌ కావడంతో వాటిని కొనుగోలు చేస్తున్న వ్యాపారులు తోటల్లోనే కార్బైడ్, ఇథనాల్‌ వంటి రసాయనాలతో మాగబెట్టి రంగు తేలిన పండ్లను బహిరంగ మార్కెట్‌లో విచ్చ లవిడిగా విక్రయిస్తు న్నారు. రసాయనాలతో వినియోగించి మాగబెడుతూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నా రు. అధికారులు స్పందించి గోదాములు, తోటల్లోని గదుల్లో తనిఖీలు నిర్వహించాలని పలువురు కోరుతున్నారు.  

రసాయనాలతో మాగబట్టిన పండ్లు తినడం వల్ల ఆరోగ్యానికి ప్రమాదకరం. స్వచ్ఛమైన పండ్లు తింటే ఆరోగ్యపరంగా మేలు చేస్తాయి. పండ్లు త్వరగా పక్వానికి రావడం కోసం రకరకాల రసాయనాలను వినియోగిస్తుంటారు. వీటి వల్ల జీర్ణ వ్యవస్థ దెబ్బతిని ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. రసాయనాలు కలిపిన ఎటువంటి పదార్థాలూ తీసుకోకపోవడం ఉత్తమం.  
– పేడాడ రాజశేఖర్,  వైద్యాధికారి, అక్కులపేట పీహెచ్‌సీ, ఆమదాలవలస మండలం 
చదవండి: Cholesterol: శరీరంలో కొవ్వు ఎంత అవసరం? ఎంతకు మించితే ముప్పు?

మరిన్ని వార్తలు