బరితెగించిన టీడీపీ నేతలు.. 20కోట్ల ల్యాండ్‌ కోసం కలెక్టర్‌ పేరుతో..

7 Nov, 2022 09:05 IST|Sakshi

సాక్షి, అనంతపురం: అనంతపురం జిల్లాలో టీడీపీ నేతలు బరితెగించారు. కలెక్టర్‌ పేరుతో టీడీపీ నేతలు నకిలీ ఎన్‌వోసీ తయారు చేశారు. కూడేరులో రూ.20 కోట్ల విలువైన భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు టీడీపీ నేతలు స్కెచ్‌ వేశారు. ఈ ప్లాన్‌లో భాగంగా స్థానిక తహసీల్దార్‌, సబ్‌రిజిస్ట్రార్‌, ఎస్‌ఐ, ట్రెజరీ ఉద్యోగి.. టీడీపీ నేతలతో చేతులు కలిపారు. వారి స్కెచ్‌ బయటకు రావడంతో ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం, కూడేరు భూబాగోతం కేసును పోలీసులు ఏసీబీకి బదిలీ చేశారు. 

నోరు మెదపొద్దు..
పెనుకొండ: సీబీఐ దాడులపై ఎక్కడేగాని నోరు మెదపరాదని టీడీపీ కార్యకర్తలు, నాయకులకు ఆ పార్టీకి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే హెచ్చరికలు జారీ చేశారు. ఈ విషయంగా మాట్లాడడం కంటే మౌనంగా ఉండడమే మేలని, లేకుంటే లేనిపోని సమస్యల్లో ఇరుక్కోవాల్సి ఉంటుందని తన అనుచర గణాన్ని ఆయన అప్రమత్తం చేసినట్లు సమాచారం. 

రైల్వే పనులకు సంబంధించి కాంట్రాక్ట్‌లు నిర్వహిస్తున్న వెంకటేశ్వర చౌదరి అధికారులతో కలసి ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు ధ్రువీకరణ కావడంతో గత శుక్రవారం పెనుకొండలోని వెంకటేశ్వర చౌదరి ఇంటిపై సీబీఐ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి, కురుబ కార్పొరేషన్‌ మాజీ చైర్‌పర్సన్‌ సవితమ్మ, ఆమె భర్త వెంకటేశ్వర చౌదరితో పాటు ఇతర కుటుంబసభ్యుల బ్యాంక్‌ ఖాతాల వివరాలు, పుస్తకాలను సీబీఐ అధికారులు తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ క్రమంలోనే వీరందరి ఖాతాలతో పాటు సన్నిహితుల బ్యాంక్‌ ఖాతాలనూ సీబీఐ అధికారులు సీజ్‌ చేయనున్నారనే చర్చ జోరుగా సాగుతోంది. అంతేకాక ఆర్థిక నేరాలకు సంబంధించి భార్యాభర్తలు బెంగళూరులోని సీబీఐ కార్యాలయంలో విచారణను ఎదుర్కొవాల్సి ఉంటుందని కూడా స్థానికులు అంటున్నారు.      

మరిన్ని వార్తలు