15 నిమిషాల్లోనే స్కానింగ్‌ రిపోర్ట్‌

25 Oct, 2021 02:37 IST|Sakshi
టీటీడీ శ్రీపద్మావతి చైల్డ్‌ కార్డియాక్‌ సెంటర్‌

రుయాకు వరంలా చైల్డ్‌ కార్డియాక్‌ సెంటర్‌

రోజుకు 200కు పైగా ఓపీలు

సగటున 15 మంది పిల్లలకు ఎకో కార్డియోగ్రామ్‌

తిరుపతి (తుడా): ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచనల నుంచి పుట్టిన గుండె చికిత్సాలయం ఆదరణ పొందుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బర్డ్‌ పాత భవనంలో శ్రీ పద్మావతి చిన్నపిల్లల కార్డియాక్‌ సెంటర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చేతుల మీదుగా ఈ నెల 11న ప్రారంభించిన ఈ సెంటర్‌ రుయాకు వరంగా మారింది. ఇందులోని చిన్నపిల్లల ఆస్పత్రికి రోజుకు 200కు పైగా ఓపీలు నమోదవుతున్నాయి. వీరిలో రోజుకు 15 మంది చిన్నపిల్లలకు ఎకో కార్డియోగ్రామ్‌ (గుండె స్కానింగ్‌) అవసరమవుతోంది.
కార్డియాక్‌ సెంటర్‌లో ఐసీయూ వార్డు   

మూడు నెలల క్రితం వరకు గుండె స్కానింగ్‌ కోసం స్విమ్స్, ప్రైవేట్‌ ల్యాబ్‌లకు వెళ్లాల్సి వచ్చేది. ప్రభుత్వం కొత్తగా కార్డియాలజిస్టును నియమించడంతో ఈ సమస్య పరిష్కారమైంది. కేవలం 15 నిమిషాల్లోనే ఎకో కార్డియోగ్రామ్‌ (గుండె స్కానింగ్‌) రిపోర్టును అందజేస్తున్నారు. ఓపీ సేవలు ముగిసేలోపే రిపోర్టు వస్తుండటంతో వైద్యులు పరిశీలించి వెంటనే సూచనలు చేస్తున్నారు. గతంలో ఈ పరీక్ష చేయించుకుని నివేదిక తీసుకోవాలంటే రోజంతా నిరీక్షించాల్సిన పరిస్థితి ఉండేది. గుండె సంబంధిత సమస్యలున్న పిల్లలను బయటి ప్రాంతాలకు తీసుకెళ్లే పనిలేకుండా స్థానికంగానే అత్యున్నత వైద్యం అందుతుండటంపై బాధితుల కుటుంబీకులతోపాటు వైద్యాధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.   

మరిన్ని వార్తలు