ఆకాశమే హద్దుగా ప్రతిభ చాటండి

18 Dec, 2022 04:58 IST|Sakshi
గిరిజన బాలల క్రీడా పోటీలను ప్రారంభిస్తున్న మంత్రులు

గిరిజన క్రీడాకారులకు కేంద్ర మంత్రి రేణుకా సింగ్‌ పిలుపు 

అట్టహాసంగా ప్రారంభమైన గిరిజన విద్యార్థుల జాతీయ క్రీడలు 

ఈ నెల 22 వరకు పోటీలు 

సాక్షి, అమరావతి: కృష్ణానది ఒడ్డున, దుర్గా మాత ఒడిలో గిరిజన బాలల జాతీయ క్రీడోత్సవాలు జరగడం పెద్ద సంబరమని కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ సహాయ మంత్రి రేణుకా సింగ్‌ సరుట చెప్పారు. ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞత­లు తెలిపారు. ఆదివాసీలు ప్రకృతిలో భాగమని, ఆకా­శమే హద్దుగా ఆటలాడి ప్రతిభ చాటాలని, ప్రఖ్యా­త క్రీడాకారులుగా రాణించాలని చెప్పారు.

ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యార్థుల మూడో జాతీ­య క్రీడలు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో శనివారం రాత్రి అట్టహాసంగా ప్రారంభ­మ­య్యాయి. రేణుకా సింగ్, డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర క్రీడా జ్యోతిని వె­లి­గించి జాతీయ క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. 

నేటి కాలంలో ఏకలవ్యుడి వంటి శిష్యులు ఎంతో మంది ఉ­న్నారని, మరెందరో ద్రోణాచార్యులు కూడా ఉ­న్నా­రని అన్నారు. కేంద్రం దేశవ్యాప్తంగా 30 లక్షల మం­దికి ఉపకార వేతనాలిచ్చి ప్రోత్సహిస్తోందన్నారు. కాగా అంతకుముందు కేంద్ర మంత్రి రేణుకా సింగ్‌ విజయవాడలో ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్నారు.

మన రాష్ట్రంలో జరగడం గర్వకారణం 
గిరిజన విద్యార్థుల జాతీయ క్రీడలు మన రాష్ట్రంలో జరగడం గర్వించే విషయమని పీడిక రాజన్న దొర అన్నారు. గిరిజనులంటే సీఎం వైఎస్‌ జగన్‌కు ఎంతో ప్రేమ అని చెప్పారు. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల ఏర్పాటే ఇందుకు నిదర్శనమన్నారు. గిరిజన బాలలను విద్యతోపాటు క్రీడల్లోనూ ప్రోత్సహించడానికి ఐదు జిల్లాల్లో స్పోర్ట్స్‌ స్కూల్స్‌ ఏర్పాటు చేశారని తెలిపారు. 

ఆరు పథకాల ద్వారా గిరిజన విద్యార్థులను విద్యాపరంగా  ప్రోత్సహిస్తున్నారన్నారు. 1.26 లక్షల గిరిజన కుటుం­బాలకు ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాల కింద 2,48,887 ఎకరాలు ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ గొడ్డేటి మాధవి, ఎమ్మెల్యే వి.కళావతి, తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 22వ తేదీ వరకు జరిగే ఈ క్రీడా పోటీల్లో 22 రాష్ట్రాల నుంచి 4344 మందికి పైగా క్రీడాకారులు పాల్గొంటున్నారు. 

ఏపీ గిరిజన బాలలతో ‘ధింసా’ నృత్యం 
కాగా ఏపీకి చెందిన గిరిజన బాలలు ప్రదర్శించిన ధింసా, లంబాడీ నృత్యాలు, తెలంగాణ బాలల గుస్సాడీ నృత్యం అందరినీ అలరించాయి.

క్రీడాకారులకు సీఎం శుభాకాంక్షలు 
దేశంలోని 22 రాష్ట్రాల నుంచి వచ్చిన గిరిజన క్రీడాకారులకు సీఎం జగన్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సీఎం పంపిన సందేశాన్ని డిప్యూటీ సీఎం రాజన్న దొర చదివి వినిపించారు. ‘స్వచ్ఛమైన మనసుతో నిర్మలంగా జీవించే గిరిజనులంతా నా కుటుంబ సభ్యులు.

రాష్ట్ర ప్రభుత్వం వారి ఉన్నతికి, అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తోంది. నవరత్నాల ద్వారా వారి అభివృద్ధి కాంక్షిస్తోంది. క్రీడాకారులకు, కోచ్‌లకు, అధికారులకు, ఈఎంఆర్‌ఐ స్కూల్స్‌ సిబ్బందికి నా శుభాభినందనలు’ అని సీఎం వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు