‘వెంకటగిరి’ ఉత్పత్తులు అత్యద్భుతం

18 Oct, 2023 05:04 IST|Sakshi
బంగారుపేటలో చేనేత పడుగు అల్లును పరిశీలిస్తున్న జగీష్‌ తివారి మిశ్రా

ఇన్వెస్ట్‌ ఇండియా టీమ్‌ కమిటీ కితాబు

సైదాపురం/వెంకటగిరి రూరల్‌:  వెంకటగిరి నేతన్నలు తయారు చేసిన పలు అద్భుతమైన డిజైన్‌లు అబ్బురపరుస్తున్నాయని ఇన్వెస్ట్‌ ఇండియా టీమ్‌ కమిటీ ప్రతినిధులు కితాబిచ్చారు. వెంకటగిరి చీరలు, చేనేత ఉత్పత్తులు, జరీ తదితర ఉత్పత్తులను మంగళవారం కేంద్ర బృందం పరిశీలించింది. ఓపెన్‌ ఇండియా ఒన్‌ ప్రొడెక్ట్‌ అవార్డులో భాగంగా 2023లో ప్రతిష్టాత్మకంగా జరిగే పోటీల్లో వెంకటగిరి చేనేత ఉత్పత్తులకు ప్రాధాన్యమిచ్చారు. ఈ మేరకు ఇన్వెస్ట్‌ ఇండియా టీమ్‌ కమిటీ ప్రతినిధి జగీష్ తివారిమిశ్రా, తిరుపతి జిల్లా కలెక్టర్‌ వెంకటరమణారెడ్డితో కలిసి వెంకటగిరిలో తయారు చేసే పలు చేనేత ఉత్పత్తులు, చీరలు, డిజైన్‌లను పరిశీలించారు.

కేంద్ర బృందానికి వైఎస్సార్‌సీపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు, వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి స్వాగతం పలికారు. పట్టణంలోని సాలి కాలనీలోని టాటాట్రస్ట్‌ అంతరాన్‌ అందిస్తున్న సహకారం, నేతన్నల వృత్తిలో నైపుణ్యం వంటి అంశాలపై ఆరాతీశారు. బంగారుపేటలో రాష్ట్రపతి చేనేత అవార్డు గ్రహీతలు కూనా మల్లికార్జున్‌. గౌరవబత్తిన రమణయ్య నివాసాల వద్ద  జందాని ట్రెడిషన్‌ రంగంలో తయారు చేసిన చీరలు, చీరలపై తెలుగు సంప్రదాయల కళ ఉట్టిపడేలా తయారు చేసిన డిజైన్‌లపై ఆరాతీశారు.

వెంకటగిరి రాజా కాలంలో వెంకటగిరి జరీ చీరల ప్రత్యేకతపై వివరాలు తెలుసుకున్నారు. రాజరాజేశ్వరి చేనేత సహకారం సంఘాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం వెంకటగిరిలోని ప్రముఖ వస్త్ర వ్యాపారి నక్కా వెంకటరమణయ్య అండ్‌ సన్స్‌ వద్దకు వెళ్లి తయారీ విక్రయానికి సిద్ధంగా ఉన్న పట్టు చీరలను పరిశీలించారు.అలాగే ప్రసిద్ధి చెందిన ఐఐహెచ్‌టీ (ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యాండ్‌లూమ్‌ టెక్నాలజీ) కళాశాలను కేంద్ర బృందం ప్రతినిధి జిగీష తివారి మిశ్రా పరిశీలించారు.

మరిన్ని వార్తలు