పార్లమెంట్‌లోని అంబేడ్కర్‌ విగ్రహం తరహాలోనే..!

28 Aug, 2020 08:31 IST|Sakshi

స్వరాజ్‌ మైదాన్‌లో విగ్రహ నిర్మాణంపై మంత్రుల సమావేశం

పార్కు సుందరీకరణకు డిజైన్‌ సమర్పించిన ఐదుగురు కన్సల్టెంట్లు

సాక్షి, అమరావతి: భారత పార్లమెంట్‌లోని డాక్టర్‌ బిఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహం తరహాలోనే.. విజయవాడలోని స్వరాజ్‌ మైదాన్‌లో 125 అడుగుల విగ్రహం డిజైన్‌ ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గురువారం సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపె విశ్వరూప్, దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో చెన్నైకి చెందిన కన్సల్టెంట్‌ ఇచ్చిన విగ్రహ డిజైన్‌ను ఖరారు చేశారు.
(చదవండి: యరపతినేని అనుచరులు 13 మందిపై సీబీఐ కేసు)

► పార్క్‌ సుందరీకరణకు ఐదుగురు కన్సల్టెంట్స్‌ నుంచి డిజైన్‌లు రాగా, వీటన్నింటినీ పరిశీలించారు. 
► విగ్రహం కింద పీట (పెడస్టల్‌) ఎత్తు 30 అడుగులు ఉంటుంది. దీనిపై 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటు చేస్తారు. కింది భాగంలో గ్రంధాలయం, ధ్యాన మందిరం, కన్వెన్షన్‌
హాలు వంటివి ఏర్పాటు చేస్తారు. మిగిలిన స్థలంలో పార్క్‌ ఉంటుంది.
►  పచ్చదనం ఉండే డిజైన్‌లకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వ ఆలోచన కాగా, సర్వాంగ సుందరంగా సందర్శకులను ఆకట్టుకునే విధంగా వచ్చే డిజైన్‌లకు అధిక ప్రాధాన్యత
ఇవ్వనున్నారు. 
► వచ్చే నెల 2న విగ్రహ కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆ సమావేశంలో కమిటీ సభ్యులు తుది డిజైన్‌ ఖరారు చేస్తారు. సీఎం సూచనలు తీసుకున్న తరువాత
పనులు మొదలు పెట్టాలని నిర్ణయించారు. సమావేశంలో అధికారులు కరికాల వలవన్, ముద్దాడ రవిచంద్ర, హర్షవర్థన్, గ్రీన్‌ కార్పొరేషన్‌ ఎండీ చంద్రమోహన్‌రెడ్డి పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు