ట్రాన్స్‌ఫార్మర్లపై పచ్చ మీడియా తప్పుడు లెక్కలు 

7 Jan, 2023 08:18 IST|Sakshi
( ఫైల్‌ ఫోటో )

వాస్తవ నిల్వలకు దరిదాపుల్లో లేని అంకెలతో పచ్చ పత్రిక రాతలు

2021 ఏప్రిల్‌ నాటికి 633 ఉంటే దాదాపు 90 లక్షలున్నట్లు విష ప్రచారం

వృథాగా పడి ఉన్నాయంటూ పచ్చి అబద్ధాలు

టెండర్లలో పాల్గొనని కంపెనీల నుంచి ఎందుకు కొనలేదంటూ వితండ వాదన 

సాక్షి, అమరావతి: ట్రాన్స్‌ఫార్మర్ల కొనుగోలు, నిల్వలపై ‘కేరాఫ్‌ కడప.. విచ్చలవిడిగా ట్రాన్స్‌ఫార్మర్ల కొనుగోళ్లు’ శీర్షికతో అర్ధం లేని రాతలు, పొంతనలేని లెక్కలతో పచ్చి అబద్ధాలను ప్రచురించి పచ్చ పత్రిక అడ్డంగా దొరికిపోయింది. డిస్కమ్‌లపై బురద చల్లేందుకు ప్రయత్నించి అభాసుపాలైంది. తప్పుడు రాతల వెనుక వాస్తవాలను ‘ఏపీసీపీడీసీఎల్‌’ వెల్లడించింది.

ఆరోపణ: 2021 ఏప్రిల్‌ 1 నాటికి రూ.145.86 కోట్ల విలువైన 88,88,203 ట్రాన్స్‌ఫార్మర్లు డిస్కమ్‌ పరిధిలోని వివిధ స్టోర్లలో ఉన్నాయి.
వాస్తవం: 2021 ఏప్రిల్‌ 1 నాటికి రూ.10.77 కోట్లు విలువైన 633 ట్రాన్స్‌ ఫార్మర్లు మాత్రమే ఉన్నాయి.
ఆరోపణ: 2021 ఏప్రిల్‌ నుంచి 2022 డిసెంబర్‌ 31 మధ్య రూ.956.69 కోట్లతో 4,44,09,492 ట్రాన్స్‌ఫార్మర్లను కొనుగోలు చేశారు. 
వాస్తవం: 2021 ఏప్రిల్‌ నుంచి 2022 డిసెంబర్‌ 31 మధ్య రూ.358.97 కోట్లతో 32,728 ట్రాన్స్‌ఫార్మర్లను మాత్రమే కొనుగోలు చేశారు.
ఆరోపణ: 2022 డిసెంబర్‌ 31 నాటికి విజయవాడ, గుంటూరు, సీఆర్‌డీఏ, ఒంగోలు స్టోర్స్‌లో రూ.385.38 కోట్ల విలువైన 1,22,61,706 ట్రాన్స్‌ ఫార్మర్లు నిల్వ ఉంచారు.
వాస్తవం: గత డిసెంబర్‌ 31 నాటికి అన్ని స్టోర్స్‌­లో కలిపి రూ.149.86 కోట్ల విలువైన 16,634 ట్రాన్స్‌ ఫార్మర్లు మాత్రమే నిల్వ ఉన్నాయి.
ఆరోపణ: ఏడాదిన్నరలోనే ఏపీసీపీడీసీఎల్‌ పరి­ధి­లో రూ.కోట్ల విలువైన ట్రాన్స్‌ ఫార్మర్ల కొను­గోలు చేయడం వెనుక భారీ వ్యూహం ఉంది.
వాస్తవం: ప్రస్తుతం స్టోర్లలో నిల్వ ఉన్న 16,634 ట్రాన్స్‌ఫార్మర్ల నుంచి 13,361 ట్రాన్స్‌ఫార్మర్లను కొత్త వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్ల కోసం, చోరీకి గురైన చోట్ల కొత్తవి ఏర్పాటు, రోలింగ్‌ స్టాక్‌ కోసం వినియోగించనున్నారు. వర్షాలతో పొలాల్లో నీరు చేరడం, కోతల సమయం కావడంతో ట్రాన్స్‌ఫార్మర్లు బిగించడానికి అవకాశం లేక కొంత జాప్యం జరిగింది. ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి. వేసవి చివరి కల్లా పెండింగ్‌లో ఉన్న అన్ని వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు ఇచ్చేందుకు నిల్వ చేసిన విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు వినియోగిస్తారు.

ఆరోపణ: ఏబీవీ, బీహెచ్‌ఈఎల్, ఎల్‌ అండ్‌ టీ లాంటి ప్రముఖ కంపెనీలు తక్కువకే ఇస్తుంటే ఎక్కువ ధర చెల్లించి కొంటున్నారు.
వాస్తవం: విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లకు సంబంధించిన కొనుగోళ్లు పూర్తిగా టెండర్ల ద్వారా మాత్రమే జరుగుతాయి. ఓ పత్రికలో పేర్కొన్న సంస్థలు టెండర్ల ప్రక్రియలో ఇప్పటి వరకూ పాల్గొనలేదు. 11 కేవీ విద్యుత్‌ ట్రాన్స్‌ ఫార్మర్లను రూ.5 లక్షలకు, 33 కేవీ ట్రాన్స్‌ ఫార్మర్లను రూ.8.5 లక్షలకు కొనుగోలు చేయడం లేదు.

మరిన్ని వార్తలు