Vijayasai Reddy Political Profile: పార్లమెంట్‌లో సరైన గళం.. అందుకే రెండోసారి

17 May, 2022 20:23 IST|Sakshi

సాక్షి, నెల్లూరు: వైఎస్సార్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి వి. విజయసాయి రెడ్డి మరోసారి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించేందుకు సిద్ధం అయ్యారు. పార్లమెంట్‌లో తెలుగు రాష్ట్రం తరపున బలమైన గళం వినిపించిన నేతగా ఈయనకి పేరుంది. అందుకే రెండోసారి ఆయనకు అవకాశం ఇవ్వాలని పార్టీ భావించింది.. అభ్యర్థిగా ప్రకటించింది. 

విజయసాయిరెడ్డి.. పూర్తి పేరు వేణుంబాక విజ‌య‌సాయిరెడ్డి. 1957 జూలై 1న నెల్లూరు జిల్లా, తాళ్ళపూడి గ్రామంలో జననం. చెన్నైలో చార్టెడ్‌ అకౌంటెంట్‌ చేసిన విజయసాయిరెడ్డి.. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ డైరెక్టర్ గా పనిచేశారు. రెండుసార్లు వరుసగా టీటీడీ సభ్యుడిగా ఎన్నికయ్యారాయన.  

వైఎస్సార్‌సీపీ తరపున ఏకగ్రీవంగా ఇంతకు ముందు రాజ్యసభకు ఎన్నికై.. 22వ తేదీ జూన్ 2016 నుంచి 21 జూన్ 2022 వరకు రాజ్యసభ ప్రాతినిధ్యం వహించారు. రాజ్యసభలో 10 ప్రైవేట్ మెంబర్ బిల్లులను ప్రవేశపెట్టారు విజయసాయి రెడ్డి(64). అంతేకాదు.. రూల్స్‌, పెట్రోలియం & సహజ వాయువు స్టాండింగ్ కమిటీలోనూ సభ్యుడిగా పని చేశారు. తెలుగు రాష్ట్రాల హక్కుల సాధన కోసం, నిరసనల సమయాల్లోనూ క్రియాశీలకంగా వ్యవహరించిన విజయసాయిరెడ్డికి రెండోసారి అవకాశం దక్కింది ఇప్పుడు. 

సీఎం జగన్ ఆశయాలకు అనుగుణంగా పనిచేయడమే తనకు ప్రాధాన్యతాంశమని స్పష్టం చేశారు విజయసాయిరెడ్డి. అప్పగించిన బాధ్యతలను నిర్వర్తించడమే తన విధి అని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు