మదనపల్లె : అవమానభారంతో సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటన చోటుచేసుకుంది. మదనపల్లె జన్మభూమికాలనీకి చెందిన వెంకటరమణ కుమార్తె గాయత్రి(26) సాఫ్ట్వేర్ ఉద్యోగినిగా పని చేస్తోంది. ఇటీవల వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఆమె బంధువుల ఇంటికి వెళ్లింది. అక్కడ బంధువుల ఇంట్లో బంగారు గొలుసు చోరీకి గురైంది. అయితే ఈ విషయంలో గాయత్రిపై వారు అనుమానం వ్యక్తం చేయడంతో.. తీవ్ర మనస్తాపంతో గురువారం రాత్రి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించింది. ఆమెను కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు.
కుటుంబ సమస్యలతో ఇద్దరు..
వేర్వేరు ప్రాంతాల్లో కుటుంబ సమస్యలతో ఇద్దరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. మదనపల్లెలోని రామారావు కాలనీకి చెందిన శ్రీనివాసులు భార్య ఎం.అంజలి(32)కుటుంబ సమస్యలతో ఎలుకల నివారణ మందు తిని గురువారం రాత్రి ఆత్మహత్యకు ప్రయత్నించింది. బి.కొత్తకోట బీసీ కాలనీకి చెందిన వెంకటస్వామి కుమారుడు వెంకటరమణ(35) కుటుంబ సమస్యలతో శుక్రవారం పురుగుల నివారణ మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆయా ఘటనల్లో బాధితులను కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్లో మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సంబంధిత పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com