లారీకింద పడి బీటెక్‌ విద్యార్థి మృతి

30 May, 2023 11:08 IST|Sakshi

భద్రాద్రి: లారీకింద పడి యువకుడు దర్మరణం చెందిన ఘటన పట్టణంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. పట్టణంలోని శ్రీనగర్‌కాలనీకి చెందిన బీటీపీఎస్‌ ఉద్యోగి అనుమల్ల శ్రీను కుమారుడు జీవన్‌రెడ్డి (22) సోమవారం మోటార్‌ సైకిల్‌పై రాహుల్‌గాంధీనగర్‌లోని బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తున్నాడు. ఈ క్రమంలో బీసీఎంరోడ్‌లోని ఆశ్రమ పాఠశాల సమీపంలోకి రాగానే మున్సిపల్‌ చెత్త బండికి తగిలి రోడ్డుపై పడిపోయాడు.

అదే సమయంలో పాల్వంచ నుంచి కొత్తగూడెం వెళ్తున్న లారీ జీవన్‌రెడ్డి పైనుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. అతడి శరీర భాగాలు నుజ్జునుజ్జయ్యాయి. స్థానికులు భారీగా అక్కడికి చేరుకోవడంతో ట్రాఫిక్‌ స్తంభించింది. సమాచారం అందుకున్న ఎస్‌ఐ నరేశ్‌ ఘటనా స్థలానికి చేరుకుని చెల్లాచెదురుగా పడిపోయిన శరీర భాగాలను చేతితో పట్టుకుని ఆటోలో ఎక్కించడం గమనార్హం. జీవన్‌రెడ్డి బీటెక్‌ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. మృతుడి తండ్రి శ్రీను ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ నరేశ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు