భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అంతరాలయంలోని మూలమూర్తులు శుక్రవారం స్వర్ణ కవచధారులై భక్తులకు దర్శనమిచ్చారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విష్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.
కొండరెడ్లకు వైద్యసేవలు
దమ్మపేట: మండల పరిధిలోని పూసుకుంట గ్రామంలోని కొండరెడ్ల కోసం శుక్రవారం ఐటీడీఏ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. వైద్య శిబిరాన్ని డీఎంహెచ్ఓ శిరీష ప్రారంభించి మాట్లాడారు. కొండరెడ్లకు అన్ని రకాల వైద్య, రక్త పరీక్షలను నిర్వహించారు. బాధితులకు మందులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ సుకృత, డీఐఓ బాలాజీ నాయక్, మలేరియా ఆఫీసర్ స్పందన, డాక్టర్ దివాకర్, సీహెచ్ఓ నాగభూషణం, బషీరుద్దీన్, ఫార్మసిస్ట్లు, స్టాఫ్ నర్సులు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.
గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థుల ప్రతిభ
మణుగూరు రూరల్/అశ్వాపురం: వరంగల్ ఎల్బీ కళాశాలలో ఇటీవల జరిగిన ఎన్సీసీ దినోత్సవంతో పాటు ఇతర పోటీల్లో అశ్వారావుపేట మండలం మిట్టగూడెంలోని తెలంగాణ గిరిజన గురుకుల బాలుర డిగ్రీ కళాశాల విద్యార్థులు వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచారు. కళాశాలకు చెందిన టి.చరణ్ 11(టీ) బెటాలియన్ ఖమ్మం తరఫున పాల్గొని బెస్ట్ కేడెట్ అవార్డును వరంగల్ గ్రూప్ కమాండర్ ఎస్ఏ సచిన్ సెంబల్కర్ చేతుల మీదుగా అందుకున్నాడు. అలాగే, ఎం.ఉదయ్కిరణ్ హైదరాబాద్లో జరిగిన ఇంటర్ గ్రూప్ కాంపిటీషన్లో చాంపియన్గా నిలిచాడు. ఇక ఎస్.శ్రీహరి ఇంటర్ డిస్ట్రిక్ట్ బాక్సింగ్ చాంపియన్షిప్ పోటీలకు ఎంపిక కాగా, విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్ జి.స్వప్నకుమారి, అధ్యాపకులు అభినందించారు.
సీఎం సభాస్థలిని
పరిశీలించిన ఎస్పీ
దమ్మపేట: ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 13న భద్రాద్రి జిల్లా దమ్మపేట మండలంలోని మల్లారం గ్రామంలో జరిగే ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా మైదానం, ఏర్పాట్లను ఎస్పీ వినీత్ శుక్రవారం పరిశీలించారు. హెలీప్యాడ్, స్టేజీ పనులను పరిశీలించిన ఆయన పోలీసులకు పలు సూచనలు చేశారు. సీఎం సభ నేపథ్యాన బందోబస్తు అత్యంత పటిష్టంగా ఉండాలని ఆదేశించారు. కొత్తగూడెం ఓఎస్డీ సాయిమనోహర్, పాల్వంచ డీఎస్పీ వెంకటేశ్, సీఐ కరుణాకర్, ఎస్ఐలు రవికుమార్, సందీప్, సాయికిశోర్రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు పైడి వెంకటేశ్వరరావు, నాయకుడు దారా యుగంధర్ పాల్గొన్నారు.