5G Services: నెల రోజుల్లో 5జీ సర్వీసులు.. టెలికం సహాయ మంత్రి చౌహాన్‌ వెల్లడి

9 Aug, 2022 06:27 IST|Sakshi

న్యూఢిల్లీ: చిరకాలంగా ఎదురుచూస్తున్న 5జీ సేవలు నెల రోజుల్లో ప్రారంభమయ్యే అవకాశం ఉందని కేంద్ర టెలికం శాఖ సహాయ మంత్రి దేవుసిన్హ్‌ చౌహాన్‌ తెలిపారు. ఈ ఏడాది ఆఖరు నాటికి ఈ సర్వీసులను దేశవ్యాప్తంగా విస్తరించేందుకు దేశీయంగా అభివృద్ధి, తయారు చేసిన పరికరాలు వినియోగంలోకి రాగలవని ఆయన పేర్కొన్నారు. అటు 6జీ నెట్‌వర్క్‌ను కూడా అభివృద్ధి చేసేందుకు 6జీ టెక్నాలజీ ఇన్నోవేషన్స్‌ గ్రూప్‌ను ఏర్పాటు చేసినట్లు మంత్రి వివరించారు.

ఇంటర్నేషనల్‌ టెలికమ్యూనికేషన్‌ యూనియన్‌ ఆసియా, ఓషియానియా ప్రాంతానికి సంబంధించి నిర్వహిస్తున్న రీజనల్‌ స్టాండర్డైజేషన్‌ ఫోరమ్‌ (ఆర్‌ఎస్‌ఎఫ్‌) ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. దాదాపు వారం రోజుల తర్వాత ఆగస్టు 1న ముగిసిన 5జీ స్పెక్ట్రం వేలంలో రికార్డు స్థాయిలో రూ. 1.5 లక్షల కోట్ల బిడ్లు వచ్చిన సంగతి తెలిసిందే. అమ్ముడైన స్పెక్ట్రంలో రిలయన్స్‌ జియో దాదాపు సగభాగం కొనుగోలు చేసింది. ఇందుకోసం ఏకంగా రూ. 88,078 కోట్ల విలువ చేసే బిడ్లు వేసింది.  
 

మరిన్ని వార్తలు