ఇండియన్‌ ఆయిల్‌ ట్యాంకింగ్‌లో ఏపీసెజ్‌కు వాటా, రూ.1,050 కోట్ల డీల్‌    

10 Nov, 2022 13:46 IST|Sakshi

రూ.1,050 కోట్ల డీల్‌  

ఢిల్లీ: అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌ (ఏపీ సెజ్‌) మరో కొనుగోలుకు తెరతీసింది. ఇండియన్‌ ఆయిల్‌ ట్యాంకింగ్‌ లిమిటెడ్‌లో 49.38 శాతం వాటాను రూ.1,050 కోట్లు పెట్టి కొనుగోలు చేసినట్టు బుధవారం ప్రకటించింది. ఇండియన్‌ ఆయిల్‌ ట్యాంకింగ్‌ సబ్సిడరీ అయిన ‘ఐవోటీ ఉత్కల్‌ ఎనర్జీ సర్వీసెస్‌’లో 10 శాతం వాటాను సైతం కొనుగోలు చేయడం ఈ ఒప్పందంలో భాగంగా ఉన్నట్టు ఏపీ సెజ్‌ తెలిపింది.

ఇందుకోసం తప్పనిసరిగా అమలు చేయాల్సిన ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్టు వెల్లడించింది. దేశంలోనే అతిపెద్ద రవాణా సదుపాయాల కల్పన కంపెనీగా అవతరించాలన్న కంపెనీ లక్ష్యానికి అనుగుణంగా ఈ కొనుగోలు ఉన్నట్టు సంస్థ పేర్కొంది. లిక్విడ్‌ స్టోరేజీ (ద్రవరూప నిల్వ సదుపాయాలు)లో దేశంలోనే అతిపెద్ద సంస్థగా ఉన్న ఇండియన్‌ ఆయిల్‌ ట్యాంకింగ్‌.. దేశవ్యాప్తంగా 2.4 మిలియన్‌ కిలో లీటర్ల చమురు, పెట్రోలియం ఉత్పత్తుల నిల్వ సామర్థ్యంలో ఆరు టెర్మినళ్లను కలిగి ఉన్నట్టు తెలిపింది. 

మరిన్ని వార్తలు