రూ.69,900 నుంచి ధరలు ప్రారంభం
గరిష్ట ధర రూ.1,79,900
న్యూఢిల్లీ: యాపిల్ ఐఫోన్ 13 సిరీస్ ఫోన్లు ఈ నెల 24 నుంచి భారత మార్కెట్లో అందుబాటులో ఉంటాయని సంస్థ ప్రకటించింది. అమెరికా, జపాన్ తదితర చాలా దేశాల్లో అదే రోజు నుంచి విక్రయాలను మొదలవుతాయని తెలిపింది. యాపిల్ ఇండియా వెబ్సైట్లో పేర్కొన్న వివరాల ఆధారంగా.. ఐఫోన్ 13 మినీ ధరలను రూ.69,900 నుంచి 99,900 మధ్య నిర్ణయించింది. ఐఫోన్ 13 ధరలు రూ.79,900–1,09,900.. ఐఫోన్ 13 ప్రో ధరలు రూ.1,19,900–169,900, ఐఫోన్ 13 ప్రోమ్యాక్స్ ధరలు రూ.1,29,900–179,900 మధ్య ఉండనున్నాయి. ఇందులో ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ను 5జీ సపోర్ట్తో, మరిన్ని బ్యాండ్లతో యాపిల్ తీసుకొచ్చింది. అదే విధంగా కొత్త ఐప్యాడ్ (9వ జనరేషన్) ధర రూ.30,900 నుంచి.. ఐప్యాడ్ మినీ ధర రూ.46,900 నుంచి ఆరంభమవుతుంది.
ప్రీమియం ఫోన్ల జోరు..
కౌంటర్పాయింట్ అంచనాల ప్రకారం.. భారత్లో ప్రీమియం (ఖరీదైన) స్మార్ట్ఫోన్ల మార్కెట్ జూన్లో 122 శాతం వృద్ధిని నమోదు చేసింది. మొత్తం స్మార్ట్ఫోన్ల విక్రయాల్లో ప్రీమియం ఫోన్ల వాటా 7 శాతంగా ఉంది. దేశీ ప్రీమియం మార్కెట్లో వన్ప్లస్ 34 శాతం వాటాతో మొదటి స్థానంలో ఉంటే, యాపిల్ 25 శాతం వాటాతో రెండో స్థానంలోను, శామ్సంగ్ 13 శాతం వాటాతో మూడో స్థానంలో, వివో 12%, షావోమీ 7% వాటాతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.