యాపిల్‌ కంపెనీలో రూ. 138 కోట్ల ఘరానా మోసం.. భారతీయ ఉద్యోగికి 3 ఏళ్ల జైలు శిక్ష!

29 Apr, 2023 17:23 IST|Sakshi

17 మిలియన్లను స్వాహా చేసినందుకు గాను ప్రముఖ టెక్‌ దిగ్గజం యాపిల్‌ సంస్థలో పనిచేసిన మాజీ భారతీయ ఉద్యోగికి 3 ఏళ్ల జైలు శిక్షపడింది. అలాగే 19 మిలియన్ డాలర్లకు పైగా చెల్లించాలని కోర్టు ఆదేశించింది. రూ.138 కోట్ల కుంబకోణం కేసులో ఈ శిక్షను ఖరారు చేసినట్లు యూనిటైడ్‌ స్టేట్స్‌ అటార్నీ ఆఫీస్‌ (United States’ attorney's office) కార్యాలయం అధికారిక ప్రకటన చేసింది.

భారత్‌కు చెందిన ధీరేంద్ర ప్రసాద్‌ అమెరికాలోని యాపిల్‌ గ్లోబల్‌ సర్వీస్‌ సప్లై చైన్‌ విభాగంలో 2008 నుంచి 2018 వరకు విధులు నిర్వహించారు. ఈ నేపథ్యంలో అతనిపై మార్చి 2022లో అభియోగాలు నమోదయ్యాయి. గత ఏడాది నవంబర్‌లో సైతం ట్యాక్స్‌ సంబంధిత నేరాలకు పాల్పడినట్లు నేరాన్ని అంగీకరించారు. 

ధీరేంద్ర ప్రసాద్‌ (Dhirendra Prasad) ఏం చేశాడు
వెలుగులోకి వచ్చిన నివేదికల ప్రకారం.. ప్రసాద్‌ యాపిల్‌ సంస్థకు కావాల్సిన ఆయా ప్రొడక్ట్‌ల విడి భాగాల్ని ఇతర సంస్థల నుంచి కొనుగోలు చేసే అధికారం ఉంది. ఈ సమయంలో ధీరేంద్ర ప్రసాద్‌ తన దుర్బుద్ధిని చూపించారు. తన పదవిని అడ్డం పెట్టుకొని సంస‍్థకు కావాల్సిన విడిభాగాలను ఆర్డర్‌ పెట్టడం.. కంపెనీకి తెలియకుండా వాటిని ఇతర సంస్థలకు అమ్మడం, ఇక అక్రమ లావాదేవీల్లో పాలుపంచుకున్నందుకు గాను సదరు సంస్థలకు చెల్లింపులు, ప్రొడక్ట్‌లను దొంగిలించడం, తప్పుడు ఇన్‌వాయిస్‌లను తయారు చేయడం, ఇందుకు గాను రెండు వెండర్ కంపెనీల యజమానులతో కలిసి కుట్ర పన్నినట్లు, వచ్చిన ఆదాయంపై పన్ను ఎగవేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు.

నమ్మకంగా పనిచేస్తారనుకుంటే 
ఎంతో నమ్మకంతో పనిచేస్తారని పేరు సంపాదించిన ప్రసాద్‌పై యాపిల్‌ యాజమాన్యం లెక్కలు, ప్రొడక్ట్‌లు ఇతర విషయాల్లో జోక్యం చేసుకునేది. కంపెనీ తనపైన పెట్టుకున్న నమ్మకాన్నివమ్ము చేశారు. చేసిన పాపం బయటపడింది. యాపిల్‌ కంపెనీలో ప్రసాద్‌ చేసిన కుంభకోణం వెలుగులోకి వచ్చింది. యాపిల్‌ కోసం విడి భాగాలు కొనుగోలు చేసే అంశంలో సుమారు 17 మిలియన్లకు పైగా మోసం చేశారు. పన్నుకూడా చెల్లించలేదు. 

కోర్టు ఏం చెప్పిందంటే
కోర్టు వివరాల మేరకు.. యాపిల్‌లో తన పదవిని అడ్డం పెట్టుకొని అక్రమాలకు పాల్పడ్డారు. సంస్థలో ప్రొడక్ట్‌ల కొనుగోళ్ల విషయంలో స్వయంగా నిర్ణయం తీసుకునే అధికారం ఉండడం, దాన్ని దుర్వినియోగం చేస్తూ జీతం, బోనస్‌లను యాపిల్‌ నుంచి అక్రమంగా సంపాదించి కోటీశ్వరుడయ్యాడు. అంతేకాదు సంస్థలో నేరాలకు పాల్పడే ఉద్యోగుల్ని యాపిల్‌ సంస్థ ఎలా కనిపెడుతుందో తెలుసుకొని జాగ్రత్త పడ్డారు. తన అధికారాన్ని ఉపయోగించి వాటి నుంచి బయటపడ్డారు.  

3 ఏళ్ల పాటు జైలు శిక్ష 
ఆయా నేరాలకు పాల్పడినందుకు ప్రసాద్‌కు 3 ఏళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్లు కోర్టు తెలిపింది. నేరం ఒప్పుకున్న నిందితుడు..మోసం చేసి సంపాదించిన డబ్బుల్ని, ఆస్తుల్ని తిరిగి చెల్లించాలి. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మరో 3 ఏళ్ల పాటు నిశితంగా గమనించిన మరో సారి చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.  

చదవండి👉 అవధుల్లేని అభిమానం అంటే ఇదేనేమో..టిమ్‌ కుక్‌కు ఇంతకన్నా ఏం కావాలి!

మరిన్ని వార్తలు