హైద‌రాబాద్‌లో ’ఆటమ్‌’ ఎల‌క్ట్రిక్ వెహిక‌ల్ రెండ‌వ ప్లాంటు ప్రారంభం

12 Feb, 2022 08:03 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ’ఆటమ్‌’ బ్రాండ్‌ ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ సంస్థ ’ఆటమొబైల్‌’ హైదరాబాద్‌లో రెండవ ప్లాంటును ఆవిష్కరించింది. దీనితో వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 25,000 నుంచి 3.50 లక్షల యూనిట్లకు పెరుగుతుందని సంస్థ వ్యవస్థాపక ఎండీ వంశీ గడ్డం తెలిపారు. 

2020లో హైదరాబాద్‌లో కంపెనీ తొలి ఫ్యాక్టరీని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం పెట్రోల్‌ టూవీలర్ల మార్కెట్‌ ఏటా 1.50 కోట్ల యూనిట్లుగా ఉందని, ఎలక్ట్రిక్‌ ద్వికచ్ర వాహనాల మార్కెట్‌ వృద్ధి చెందుతున్న నేపథ్యంలో తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని దాదాపు మూడు లక్షల వాహనాల స్థాయికి పెంచుకోవాలని నిర్ణయించుకున్నట్లు వంశీ వివరించారు. తాజాగా ఏర్పాటైన ప్లాంటు విస్తీర్ణం 20,000 చదరపు అడుగులు. తక్కువ వేగంతో నడిచే కొత్త తరం ఈ–బైక్‌ ఆటమ్‌ 1.0, ఇతర మోడల్స్‌ను ఇందులో ఉత్పత్తి చేయనున్నట్లు ఆయన తెలిపారు. రాబోయే నెలల్లో మరిన్ని మోడల్స్‌ ఆవిష్కరించనున్నట్లు వివరించారు. 

గంటకు 25 కిలోమీటర్ల గరిష్ట వేగంతో వెళ్లే ఆటమ్‌ 1.0 ధర పన్నులతో కలిపి దాదాపు రూ.54,999 ఉంటుందని సంస్థ తెలిపింది. దీనికి లైసెన్స్, రిజిస్ట్రేషన్‌ అవసరం ఉండదని పేర్కొంది.

మరిన్ని వార్తలు