22 బెట్టింగ్‌యాప్‌లు, వెబ్‌సైట్‌లను నిషేధిస్తూ కేంద్రం ఆదేశాలు

6 Nov, 2023 11:39 IST|Sakshi

భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నవంబర్ 5న ‘మహదేవ్ బుక్‌’తో సహా 22 బెట్టింగ్ యాప్‌లు, వెబ్‌సైట్‌లను నిషేధిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. రానున్న ఛత్తీస్‌గఢ్‌ ఎన్నికల నేపథ్యంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం కొంత వివాదానికి దారితీసింది. 

చట్టవిరుద్ధమైన బెట్టింగ్ యాప్‌ల సిండికేట్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇటీవల దాడులు నిర్వహించింది. ఛత్తీస్‌గఢ్‌లోని ‘మహదేవ్ బుక్‌’యాప్‌తో పాటు ఇతర బెట్టింగ్‌యాప్‌లు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తెలిపింది. పీఎంఎల్‌ఏ చట్టం ప్రకారం మనీలాండరింగ్ ఆరోపణపై మహదేవ్ యాప్ యజమానులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు చెప్పింది. ఈ యాప్ ప్రమోటర్ల ద్వారా ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్‌కు రూ.508 కోట్లు అందినట్లు తమకు సమాచారం ఉందని ఈడీ పేర్కొంది.

అయితే బెట్టింగ్ ప్లాట్‌ఫామ్‌లను అణిచివేయడంలో బఘేల్ నేతృత్వంలోని ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం విఫలమైందని కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. సెక్షన్ 69A ఐటీ చట్టం ప్రకారం వెబ్‌సైట్/ యాప్‌ను మూసివేయమని సిఫార్సు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్నారు. అయితే గత కొద్దికాలంగా ఈడీ దర్యాప్తు చేస్తున్నా బఘేల్‌ ప్రభుత్వం అలా చేయలేదని తప్పుపట్టారు. మరోవైపు యాప్‌ను నిషేధించాలన్న అభ్యర్థన వచ్చిన వెంటనే కేంద్రం చర్యలు తీసుకుందని మంత్రి వివరించారు.

మరిన్ని వార్తలు